Friday, 13 May 2016

chaaya event12






http://magazine.saarangabooks.com/2016/04/28/1930-%E0%B0%A4%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A4%E0%B0%A8%E0%B1%87-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95/

1930 తరవాతనే తెలంగాణా ఆధునికత

srinivas



(ఛాయ 12 వ సమావేశం 1 మే, ఆదివారం సాయంత్రం 6 గంటలకి హైదరబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడ, హైదరబాద్ లో జరగబోతోంది.  ప్రఖ్యాత రచయిత, విమర్శకుడు, పాత్రికేయుడు, సంపాదకుడు,    కె. శ్రీనివాస్ “సాహిత్య చరిత్రలో ఖాళీలు “ అనే విషయం మీద మాట్లాడుతారు.  ఈ సంధర్భంగా ప్రఖ్యాత రచయిత, విమర్శకుడు,  సంగిశెట్టి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకి,  కె. శ్రీనివాస్ యిచ్చిన వివరణలు.)
  • తెలంగాణలో ఆధునిక సాహిత్యం ఎప్పటి నుండి ప్రారంభమైంది?
ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించేముందు, అనేక అంశాలను స్పష్టం చేసుకోవాలి. ఆధునిక సాహిత్యం అంటే ఏమిటి? ఆధునికత అంటే ఏమిటి? తెలంగాణలోనే కాదు, తెలుగులో ఆధునిక సాహిత్యం ఎప్పటినుంచి మొదలయింది? –  చాలా మాటలను మనం నిర్దిష్ట నిర్వచనాలు లేకుండా ఉపయోగిస్తూ ఉండడం వల్ల కొంత అస్పష్టత  ఉన్నది. పాతవి ముగిసిపోవడం, కొత్తవి మొదలుకావడం- ఇవి కొన్ని తేదీలకో సంవత్సరాలకో ముడిపెట్టగలిగిన సంఘటనలు అనుకోవడం కూడా పొరపాటు. 1900-1940 మధ్య కాలాన్ని నేను నా పుస్తకం( తెలంగాణ సాహిత్య వికాసం)లో ఆధునికతలోకి తెలంగాణ సొంత అడుగులు వేసిన కాలంగా చెప్పాను.  ఆధునికత ప్రవేశించని భౌగోళిక ప్రాంతాలు, భావప్రాంతాలు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి. అయినంత మాత్రాన తెలంగాణ ఇంకా ఆధునిక పూర్వ దశలో ఉన్నదని అనలేము. భారతదేశంలో అయినా, బ్రిటిష్‌ ఆంధ్రలో అయినా ఆధునికతలోకి జరిగింది ప్రయాణమే. ఆ ప్రయాణం ఇంకా సాగుతూనే ఉన్నది. ముగిసిపోలేదు.
హేతుబద్ధమైన ఆలోచనలు, సంస్కార దృష్టి, సార్వత్రిక విద్యాకాంక్ష,  సార్వజనీన విలువల వక్కాణింపు, వ్యక్తుల స్వేచ్ఛాభావనలు, బృందాల హక్కులు- ఇవన్నీ సమాజంలో కనిపిస్తున్నాయంటే, ఆ సమాజంలో ఆధునికత బలంగానే ఉన్నదన్న మాట. ఆధునికత గుణవాచి. అటువంటి గుణాలు ఒకానొక నిర్దిష్టకాలంలోనే సాధ్యమైనప్పుడు కాలవాచి కూడా. అయితే, అసమాన ప్రపంచంలో ఒక్కొక్క సమాజం ఒక్కో దశలో ఉంటుంది కాబట్టి,  వాస్తవార్థంలో సమకాలికమైనవన్నీ కూడా సమకాలికమైనవి కావు. దశలు అంటున్నామంటే, అనివార్యంగా ఒకదాని తరువాత మరో దశ వచ్చి తీరాలని, పారంపరిక దశలని కాదు. నైజాము పాలనలో ఉన్న తెలంగాణ, బ్రిటిష్‌ పాలనలో ఉన్న ఆంధ్ర ప్రాంతాలు 1900-1940 మధ్య కాలంలో ఒకే రకంగా లేవు. ఆధునికత లోకి ప్రవేశించిన తీరు, సమయం ఒకటే కాదు. తెలంగాణ ఆలస్యంగా ఆధునికతలోకి రావడమే కాక, భిన్నంగా కూడా వచ్చింది. ఒక ప్రతిపాదనగా చెబుతున్నది ఏమిటంటే, వలసవాదంతో ముడిపడిన ఆధునికత, దాని బౌద్ధిక చట్రం తెలంగాణలో బలంగా లేదు.
  • స్థూలంగా ఆధునికత తెలంగాణలో ఫలానా కాలంలో ప్రవేశించిందని చెప్పలేమా?
మన సదుపాయం కోసం చెప్పుకోవచ్చు. 1930ల తరువాతనే ఆధునిక సాహిత్యం అని చెప్పదగ్గది తెలంగాణలో వచ్చింది. అంతకు ముందు కాలంలో కొందరు వ్యక్తుల రచనలలో ఆధునిక భావాలు, వ్యక్తీకరణ రీతులు లేవని కాదు. ఆధునికతకు కావలసిన సన్నాహాలలోనే 1940 దాకా తెలంగాణ ఉద్యమసమాజం తలమునకలయింది. 1920లు, 1930లు అందులో క్రియాశీల కాలం.
తెలంగాణ నుంచి వచ్చిన మొదటి పత్రిక  శేద్యచంద్రిక (1887), అది అనువాద పత్రిక, ప్రభుత్వ పత్రిక అయినప్పటికీ, వివిధ రంగాలలో హైదరాబాద్‌ తలపెట్టిన ఆధునిక వ్యవస్థల నిర్మాణాల పురోగతిని నమోదు చేసింది. ముఖ్యంగా వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులను ప్రచారం చేయడానికి ఉద్దేశించిన ఆ పత్రికలో,  టెలికమ్యూనికేషన్‌, రోడ్లు వంటి ఇతర ఆధునిక వ్యవస్థల గురించి కూడా ప్రస్తావనలు ఉన్నాయి.  దానిని సాహిత్యేతర పత్రిక అని పరిగణనలోకి తీసుకోకపోయినా,  సాహిత్యాంశాలు కలిగిన మొదటి తెలంగాణ పత్రిక హితబోధిని (1913) లో కూడా ఆధునిక భావాలను పుష్కలంగా చూడవచ్చు. సంస్థానాధీశులలో నూతన భావాలు కలిగిన సంస్కారిగా నాడు పేరు పొందిన బరోడా రాజు ప్రసంగాలను పునర్ముద్రించింది కూడా ఆ పత్రిక.  తెలంగాణ నుంచి మొదటి మహిళాకవి రచన కూడా ఆ పత్రికలోనే ఉన్నది. ఆధునికమనదగ్గ రీతిలో రాసిన కథనాలున్నాయి.  అయినప్పటికీ, 1915 నాటికి తెలంగాణ సమాజం ఆధునికతలోకి ప్రవేశించిందని చెప్పలేము. వ్యావహారిక భాషా రచనలు 1930లోపే వచ్చాయి. మాండలికంలో కథారచన  1930లలో నే చురుకుగా మొదలయింది. గోలకొండ కవుల సంచిక  లో ఆధునిక సాహిత్యం తక్కువే అయినప్పటికీ, ఆ ప్రయత్నమే ఆధునికమయినది.
1930 దశాబ్దారంభంలో ఆంధ్రమహాసభ ప్రారంభమయింది.  ఆధునిక విద్యావంతుల వర్గం ఒకటి చిన్నగా అయినప్పటికీ ఏర్పడింది. పత్రికల సంఖ్య పెరిగింది. వివిధ సామాజిక, కుల సంఘాలు క్రియాశీలంగా పనిచేయసాగాయి. గ్రంథాలయాలు విస్తృతంగా వ్యాపించి, ఊరూరా మార్పును కోరే యువతరం ఒకటి రూపుదిద్దుకున్నది. ఇవన్నీ సాహిత్యంలో ఆధునికత కు తోడ్పడ్డాయి. తెలంగాణ సమాజ వికాసానికి సాహిత్యంలో ఆ మార్పులు అవసరమయ్యే పరిస్థితి వచ్చింది.
  • తెలంగాణ అస్తిత్వ ఉద్యమ సాహిత్యం ఎప్పటి నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు?
తెలంగాణవాద సాహిత్యం లేదా తెలంగాణ అస్తిత్వ ఉద్యమసాహిత్యం 1995 తరువాతనే మొదలయిందని చెప్పాలి. 1969 ఉద్యమ సందర్భంగా వచ్చిన సాహిత్యం తెలంగాణవాద సాహిత్యం కాదా? అన్న సందేహం వస్తుంది.జాషువా కవిత్వాన్ని దళిత వాద కవిత్వం గా అనడం సాంకేతికంగా ఎట్లా పొరపాటు అవుతుందో, 1970ల నాటి కవిత్వాన్ని తెలంగాణ వాద కవిత్వం అని అనడం కూడా పొరపాటు అవుతుంది. 1969 ఉద్యమానికి  కూడా సైద్ధాంతికత లేదని కాదు. చైనా సాంస్కృతిక విప్లవం ప్రతిఫలనంగా తెలంగాణ ఉద్యమాన్ని చెప్పినవారు, భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన దశగా నాటి కాలాన్ని నిర్వచించినవారు ఉన్నారు. లోతుగా నాటి ఆకాంక్షల మూలాన్ని వెదికిన వారున్నారు. కానీ, ఆ సైద్ధాంతికత ఒక బలమైన, సమగ్రమైన రూపం తీసుకోలేదు. ప్రాంతీయ వివక్షను తీవ్రంగా ఖండించడం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఉద్వేగపూరితంగా వ్యక్తం చేయడం, సాంస్కృతిక భేదాలను ప్రస్తావించడం నాటి సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో కనిపిస్తుంది కానీ, దాన్ని 1990ల నాటి తెలంగాణవాదంతో సమానం చేయలేము. నాటి ఉద్యమానికి ఉండిన పరిమితులు సాహిత్యంలోనూ ఉన్నాయి.
మలిదశ తెలంగాణ ఉద్యమం- ఉద్యోగ, విద్యావకాశాలతో పాటు, వనరుల పరిరక్షణ, మనుగడల సంరక్షణలను ప్రధానంగా తీసుకున్నది. సాగునీటి సమస్య, గ్రామీణ సంక్షోభం- నేపథ్యంలో, ప్రజలను ఏకత్రితం చేసేవిధంగా సాగిన సాంస్కృతిక సాహిత్యోద్యమాలు ఉద్యమానికి చోదకాలుగా ఉన్నాయి. మాది మాకు కావాలె- అన్న నినాదం- ప్రపంచీకరణ నేపథ్యంలోనూ, అస్తిత్వవాదాల ప్రభంజనంలోనూ భాగంగా వచ్చినది. ఆ రెండు పరిస్థితులూ 1970 నాటికి లేవు.
  • తెలంగాణలో మధ్యతరగతి ఏర్పడిందా? ఏర్పడితే ఎప్పటినుంచి?
తెలంగాణలో మధ్యతరగతి ఉనికి గురించి గతంలో నేను వ్యాఖ్యానించినప్పుడు మిత్రులు కొందరు సందేహం వ్యక్తం చేశారు. మధ్యతరగతి- ఒక  నిర్దిష్ట ఆర్థికవర్గాన్ని సూచించే వాడుక పదం. పట్టణజీవితంలోని వేతనజీవులు, వృత్తినిపుణులు, చిన్నవ్యాపారులు- వీరితో కూడిన వర్గం అది. గ్రామీణమూలాలతో నామమాత్రపు సంబంధాలు మిగలడమో, పూర్తి తెగదెంపులో జరిగిన వర్గం అది.  దాని ఆలోచనావిధానం భిన్నంగా ఉంటుంది. సమాజంలో విలువల ఘర్షణకు ఆ వర్గం వేదికగా ఉంటుంది.  బ్రిటిష్‌ ఆంధ్రలో తొలిదశల్లో బ్రాహ్మణవిద్యావంతులతో ప్రాథమికంగా ఈ వర్గం ఏర్పడింది. అక్కడి ఆధునిక సాహిత్యం ఈ వర్గం నుంచి అధికంగా వచ్చింది. తెలంగాణలో మధ్యతరగతి సాహిత్యం తక్కువ.  కథలు, నవలలు వంటి ఆధునిక ప్రక్రియలలో కూడా ఈ వర్గ జీవితం ఉన్నవి తక్కువే.
ఇందుకు కారణమేమిటి?
1913 నాటికి తెలంగాణలో చదువుకున్నవారే 3 శాతం ఉన్నారట. అందులో తెలుగువారు పది శాతం కూడా లేరు. నిజాం ప్రభుత్వంలో పనిచేసిన తెలుగువారు స్వల్పం. ఉర్దూ చదువుకుని న్యాయవాద వృత్తిలో ఉన్నవారు అక్కడక్కడా కనిపించేవారు. వారు కాక ఉపాధ్యాయులు. అంతే. ఆ పరిస్థితి 1948 నాటికి కూడా విప్లవాత్మకంగా ఏమీ మారలేదు. ఇప్పటికయినా, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చదగ్గరీతిలో తెలంగాణలో మధ్యతరగతి లేదు. ఆ కాలంలో  హైదరాబాద్‌, వరంగల్‌ తప్ప పట్టణాలని చె ప్పదగ్గవే లేవు. ఈ మధ్యకాలంలో మాత్రం తెలంగాణలో మధ్యతరగతి వేగంగా ఏర్పడుతున్నది. అయితే వారిలో మధ్యతరగతి స్వభావం ప్రస్ఫుటంగా వ్యక్తం కావడానికి ఇంకా సమయం పడుతుంది.   తెలంగాణ ప్రాంతం వివక్షకు లోనయిందని చెబుతున్న రంగాలలో విద్యా, ఉద్యోగరంగాలు ముఖ్యమయినవి. ఆ అంతరమే మధ్యతరగతి నామమాత్రం కావడానికి, మధ్యతరగతి కేంద్రిత  సాహిత్యం రాకపోవడానికి కారణాలని చెప్పుకోవచ్చు.

  • తెలంగాణ సాహిత్యంపై మార్క్సిజం ప్రభావం ఏ మేరకు ఉన్నది?
వికాసోద్యమకాలంలో ఉన్నదని చెప్పలేము. 1930 ద్వితీయార్థం నుంచి మొదలుపెట్టి, మార్క్సిస్టు భావాల ప్రత్యక్ష, పరోక్ష ప్రస్తావనలు కనిపిస్తాయి. సమకాలంలోని వివిధ రాజకీయ సిద్ధాంతాల గురించిన ఆసక్తితో, వాటిని ప్రజలకు తెలియజెప్పాలన్న సంకల్పంతో  కెసి గుప్త, వట్టికోట ఆళ్వారుస్వామి  పనిచేశారు. 1940ల ఆరంభం నుంచి కమ్యూనిస్టుపార్టీ తెలంగాణలో క్రియాశీలంగా విస్తరిస్తూ వచ్చింది. ప్రపంచపటం మీద తెలంగాణను ఆవిష్కరించిన  తెలంగాణ సాయుధపోరాటంమీద, పోరాట సాహిత్యం మీద మార్క్సిజం ప్రభావం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. స్తబ్దంగా ఉన్నదని అనుకున్న 1960లలో కూడా ప్రగతిశీల సాహిత్యం, కవిత్వం, కథలు రెండూ తెలంగాణ నుంచి వచ్చాయి.  1965 తరువాత విప్లవోద్యమం ప్రభావం గురించి కూడా తెలిసిందే. 1990 దాకా విప్లవసాహిత్యోద్యమ ప్రభావం గణనీయంగా ఉన్నది.  తరవాత కాలంలో కూడా  ఒక ప్రధాన కోవగా కొనసాగుతూనే ఉన్నది.  తొలి, మలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో పార్లమెంటరీ కమ్యూనిస్టుల వైఖరులు ఎలాగ ఉన్నా, విప్లవ కమ్యూనిస్టులు క్రియాశీలంగా పాలుపంచుకున్నారు.  అందువల్ల 1995 తరువాతి తెలంగాణవాద సాహిత్యంపై కూడా మార్క్సిజం ప్రభావం స్పష్టంగా చూడవచ్చు.
  • మార్క్సిజం వరమా, శాపమా?
వరాలు ఇవ్వడానికి అది దైవమూ కాదు, శపించడానికి దెయ్యమూ కాదు. అది ఒక సైద్ధాంతిక సాధనం, ఆచరణ మార్గం.   కమ్యూనిస్టు పార్టీలతో మనకు సమస్యలు ఉండవచ్చు, వారి ఆచరణ విధానాలతో విభేదాలు ఉండవచ్చు. కానీ, చరిత్రను, వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తును నిర్మించుకోవడానికి పనికివచ్చే  శాస్త్రీయమైన సిద్ధాంతం గా  విలువైనది మార్క్సిజం.  భౌతికవాద ఆలోచనలకు భారతీయ గతంలో కూడా మూలాలున్నాయి. మార్క్సిజం ఇప్పటికే అనేక కొత్త వ్యాఖ్యానాలకు, జోడింపులకు, విస్తరణలకు గురిఅయింది.  వర్తమాన భారతానికి అవసరమైన అన్వయాలను, సవరణలను చేసుకోవడం ఇక్కడి మార్క్సిస్టుల పని. వారికి ఆ తెలివిడి  కలగడానికి లోపలినుంచి, బయటినుంచి కూడా ఒత్తిడులు పెరుగుతున్నాయని మనకు తెలుసు.
  • సమాజంలో వివిధ డైమన్షన్లలో ఉండే ఖాళీలను సాహిత్యం ఎప్పటికైనా పరిపూర్ణంగా పూరించగలదా?
బాలగోపాల్‌ చెప్పినదాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అడుగుతున్నట్టున్నారు. ప్రామాణికతా భావనలకూ నిజజీవితాని కీ మధ్య ఉండే అంతరం గురించి చెబుతూ, ఆ అంతరం వల్ల ఏర్పడే ఖాళీ కారణంగా ఏర్పడే దాహం గొప్ప సాహిత్య సృష్టికి దోహదకారి అవుతుందని ఆయన అన్నారు.  విస్మృతి వల్ల, అజ్ఞానం వల్ల, పాక్షికత వల్ల చూడలేకపోయిన వాస్తవికతలు కూడా ఖాళీలేనని, మంచి సాహిత్యం వాటిని భర్తీచేసి, అగోచరాలను కూడా గోచరం చేస్తుందని బాలగోపాల్‌ అన్నారు. మనం చూడలేకపోయిన వాస్తవికతలను కళ్లముందుకు లాక్కురాగలిగే సాహిత్యం సమాజంలోని ఖాళీలను పూరించే ప్రయత్నాలకు దోహదకారి అవుతుంది.  పరిపూర్ణత అనేది సాపేక్షం. భర్తీచేసుకుంటూ పోవడం ఒక ప్రక్రియ.
  • తెలంగాణ భాషను పూర్తిస్థాయిలో, కనీసం పాలన, విద్య, పత్రికారంగాలలో, అమలులోకి తీసుకురావడానికి తీసుకోవలసిన చర్యలేమిటి?
ఈ విషయంలో నావి ఉద్యమకారులు అంతగా మెచ్చని అభిప్రాయాలు. తెలంగాణ భాష అనడం పొరపాటు. దేన్ని భాష అనాలి, దేన్ని మాండలికం అనాలి – నిర్ణయించడానికి భాషాశాస్త్రం ఉన్నది. మాండలికం ( అది కూడా పరిభాషాపదమే) అన్న మాట నచ్చకపోతే, మరో మాట పెట్టుకోవచ్చు.
మనం చేయగలిగింది, తెలుగుభాషలో తెలంగాణ పదజాలం ప్రాతినిధ్యం పెంచడం. తెలంగాణ వ్యక్తీకరణలను, జాతీయాలను, సామెతలను మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావడం. సాహిత్యకారులు ఇప్పటికే విస్తృతమైన స్థానిక పదజాలాన్ని తమ రచనల ద్వారా ఆవిష్కరించారు. ఏది తెలంగాణ పదం, ఏది కాదు అని నిర్ణయించడం నిఘంటుకారులు చేయవలసిన పని. సమగ్ర తెలంగాణ పదకోశం ఒకటి రూపొందాలి. అప్పటికి కూడా అందులోని పదజాలం ఇతర తెలుగు ప్రాంతాల్లో ఎక్కడా వాడుకలో ఉండదని చెప్పలేము. తెలంగాణ లోని వివిధ వృత్తులవారు, కులాల వారు ఉపయోగించే పదజాలాన్ని మొత్తం సేకరించాలి. సాహిత్యంలోని పదప్రయోగాలను క్రోడీకరించాలి. సాంకేతిక పరిభాషా నిర్ణయంలో స్థానిక పదజలాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయాలి.  అచ్చమైన తెలంగాణ స్థానిక వాడుకను సృజనాత్మక రచనల్లో మిగుల్చుకోవచ్చు. కానీ ఆధునిక వినియోగం కోసం, మాధ్యమాల వినియోగం కోసం ప్రమాణీకరణ అవసరం. యంత్ర భాషగా వాడడానికి కూడా ప్రమాణీకరణ కావాలి. తెలుగును యంత్రానువాదం కోసం, కంప్యూటర్‌ వినియోగం కోసం ప్రమాణీకరించే ప్రయత్నాలు మునుపే మొదలయ్యాయి, ఒకమేరకు పూర్తయ్యాయి కూడా. వారు వినియోగించే పదజాలంలో  స్థానిక పదజాలం ఎంత ఉన్నదో పరిశీలించి, తెలంగాణ పాఠాంతరాలను, వాడుకను కూడా అందులో చేర్చాలి.
  • పరిశోధన అనేది థ్యాంక్‌ లెస్‌ జాబేనా?
ఎవరి కృతజ్ఞతలూ  మనకు అవసరం లేదు కానీ, ఇదొక అనాకర్షణీయమైన వ్యాసంగం. ఎంతో కష్టపడాలి. ఫలితం ఏమీ ఉండదు. మనకు మాత్రమే ఎక్సైటింగ్‌గా ఉంటుంది, ఎదుటివారికి చాదస్తంగా ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు, ముఖ్యంగా సాహిత్యరంగ పరిశోధనలు, చాలా వరకు మొక్కుబడిగా సాగుతుంటాయి. సామగ్రి సిద్ధంగా ఉన్న అంశాన్నే ఎంచుకొమ్మని గురువులూ చెబుతుంటారు, లఘువులూ అదే చేస్తుంటారు. మౌలిక సమాచారం సేకరించవలసి వచ్చే పని తీసుకోవడంలో ఎవరికీ ఆసక్తి ఉండదు.  స్వచ్ఛంద పరిశోధకులలో ఉండే తపన, డిగ్రీల పరిశోధకులలో లేదేమో అనిపిస్తుంది, ఏ డిగ్రీ కోసమని మీరు అంత పరిశోధన చేశారు?
*

chaaya event11

By Sita Rambabu chennuri :
"సార్వ జనీన కధకుడు జయకాంతన్ "
ఛాయ సంస్థ వారు నిన్న తమ 11 వ
కార్యక్రమాన్ని హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో నిర్వహించారు
ప్రముఖ తమిళ కధా రచయిత జయకాంతన్ కధలను మరో ప్రముఖ కధా రచయిత మధురాంతకం నరేంద్ర విశ్లేషించారు
1975 ప్రాంతంలో మధురాంతకం రాజారామ్ గారు అనువదించిన
"నేనేం చెయ్యను చెప్పండి" - మరి కొన్ని కధల విశేషాలను పంచుకున్నారు నరేంద్ర
200 కధలు ,40 నవలలు 4 సాహిత్య వ్యాస సంకలనాలు
ఇదీ జయకాంతన్ గారి సృజన
అన్నారు నరేంద్ర
జయకాంతన్ గారి కధలు ఆధునిక
ఉపనిషత్ కధల్లా వుంటాయి
ఆయనో సార్వజనీన రచయిత అంటూ ఆత్మదర్శనం ,గురుపీఠం, ఎవరి ఆంతర్యం వారిదే, మౌనం ఒక భాష
వంటి కధలను నరేంద్ర విశ్లేషించారు
జయకాంతన్ కధలను గురించిన కొన్ని అబ్జర్వేషన్ లను నరేంద్ర ఇలా చెప్పారు
1 ఒక పెద్దమనిషిలా కధ చెబుతారు
పెద్ద ఫీట్లేమీ కధలో వుండవు
2 కధను ఎక్కడ దృశ్య మానం చేయాలో తెలిసినవాడు
3 కధలో అలంకారాలుండవు . కధ చెప్పే వ్యక్తి టోన్ లోనే కధ సాగుతుంది
4 మనిషే ఆయన కధలకు ప్రాణం
కేంద్రకం కూడా
5 ఆయన కధలు రాసే పధ్ధతి
Stories of ideas పద్ధతి
6 హృదయాన్ని మేధస్సును సమన్వయం చెస్తూ కధను నడపటం జయకాంతన్ కే సాధ్యం
7 కొంత artificiality ఆయన పాత్రల్లో వుందేమో అనిపిస్తుంది
8 అన్వయం లేకుండా పెద్ద పెద్ద వాక్యాలు రాస్తాడన్నది ఆయన మీద వున్న విమర్శ.
మానవత్వానికి అవధులు లేని వ్యక్తి
జయకాంతన్ అని ముగించారు నరేంద్ర...







http://magazine.saarangabooks.com/2016/04/07/%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%82%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AE%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%9A%E0%B1%87-%E0%B0%9C/

జీవితంపై ప్రేమను పెంచే జయకాంతన్

jaya


– సి.ఎస్. రాంబాబు
~
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మహానగరంలో సాహిత్య సభలే కాకుండా ప్రతి ఆదివారం ఒక సాహిత్య సమావేశాన్ని జరుపుకునే ఒక సత్సాంప్రదాయం ఒకటి మొదలయింది. అదొక శుభ పరిణామం. గత పదకొండు నెలలుగా ‘ఛాయ’ సంస్థ ప్రతినెలా మొదటి ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు నిర్వహిస్తున్న సాహిత్య సమావేశాలు కొత్త తరహాలో ఉంటూ కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నాయి. అంటే అతిశయోక్తి కాదేమో ! సమావేశానికి వారెంచుకునే అంశాలే దానికో ప్రాతిపదికను కల్పిస్తున్నాయి.
ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో తమిళ రచయిత ‘జయకాంతన్’ కధలపై సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఎవరు సమర్ధులు అంటే జయకాంతన్ గారితో సన్నిహిత సంబంధం కలిగిన సాహితీవేత్త మధురాంతకం నరేంద్రని మించిన ఛాయిస్ మరొకరుండరేమో ! ఎప్పటిలాగే సమావేశానికి సబంధించి ఒక చక్కటి పోస్టర్ ని డిజైన్ చేయించారు ‘ఛాయ’ సంస్థ వారు. చర్చనీయాంశమెంత ఆసక్తిగా ఉందో చూడండి … నేనేం చేయను చెప్పండి … మరికొన్ని విశేషాలు’
కధను సీరియస్ గా తీసుకునే వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో జయకాంతన్ ను ఏదో ఒక రకంగా వంట పట్టించుకున్నవారే. ఇతర భాషలలో కూడా ఎంతో గౌరవాన్ని పొందిన రచయిత జయకాంతన్.
జయకాంతన్ గారి కధలను తొలిసారిగా తెలుగులో అనువదించిన వ్యక్తి మా నాన్న మధురాంతకం రాజారాం అంటూ తమ ప్రసంగాన్ని మొదలుపెట్టారు మధురాంతకం నరేంద్ర. 1975 ప్రాంతంలో నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఆ పనిని మా నాన్న కప్పగించారు. అప్పటికే వారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఒక విధంగా జయకాంతన్ అనువాదానికి అంత తొందరగా లొంగని వ్యక్తి. అలాంటి వ్యక్తిని మా నాన్న అనువదించారు. మా నాన్న తొలి అనువాదకుడయితే నేను తెలుగులో జయకాంతన్ రచనల తొలి పాఠకుడిని. అప్పటికి నా వయస్సు పద్దెనిమిదేళ్ళు. ఆ పద్దెనిమిదేళ్ళ నవ యువకుడిని ఉత్కంఠంతో మరో ప్రపంచంలోకి లాక్కుపోయిన కధలివి.
ఒక విధంగా నాకు బాల్య స్మృతి వారి రచనలు చదవటం.
200 కధలు, 40 నవలలు, 4 సాహిత్య వ్యాసాల సంకలనాలతో జయకాంతన్ సాటి రచయితలందరూ అసూయపడేంతగా రాసిన వ్యక్తి. 1932వ సంవత్సరంలో కడలూర్ లో పుట్టిన జయకాంతన్ ని ఒక సందర్భంలో కలుసుకోవడం జరిగింది. ఈ ఒక్క మాట మీకు చెప్పి వారి కధలను కొన్ని మీకు పరిచయం చేస్తాను.
జయకాంతన్ గారి నవలలు కొన్నింటిని సినిమాలుగా చేయటం జరిగింది. అలాంటి ఒక నవల ‘ఒరు నడిగ్తే నాడిగం పాకులాం’. ఇది సినిమాగా వచ్చిన వారి నవల. ఐదు నిముషాల నిడివి వున్న ఒక దృశ్యం చూడగానే నవలే చదువుదామనిపించింది. ఆ నవలను ఒక మిత్రుడు అనువాదం చేశాడు. తెలుగులో దాని పేరు “కళ్యాణి వెడ్స్ దివాకరం”. వారి నవలకు వారు పెట్టిన పేరును తెలుగులో చెప్పాలంటే ‘ఒక నటి నాటకం చూస్తోంది’ ఎంత బావుందో చూడండి.
ఆ అనువాద మిత్రునితో కలసి నేను కూడా మద్రాసు (చెన్నై) వెళ్లి జయకాంతన్ గారిని కలవడం జరిగింది. మా ప్రయత్నం వారిని ఇంటర్వ్యూ చేయాలని. వారిదో మధ్యతరగతి ఇల్లు. పైన ఒక చిన్న పాక వేసుకుని వున్నారు వారు. ఆయన అక్కడే కూర్చుని రాసే వారు. ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్డు పక్కన టీ కొట్టులా వుంది వారిల్లు. దేన్నీ దాచుకోవడం వారి జీవితంలో లేదు. మాడు గంటల సేపు వారితో గడిపాం.
వారితో అలా అంత సేపు మాట్లాడిన తర్వాత వారి కథల మీద గౌరవం పెరిగింది. గళ్ళ చొక్కా, లుంగీ ఇదీ వారి డ్రెస్ కోడ్. అరమరికలు లేకుండా మాతో ఎన్నో విషయాలు మాట్లాడాడాయన. మాతో మాట్లాడినంత సేపూ మీసాన్ని తిప్పుతూనే ఉన్నాడాయన. మీసమున్న కధా వీరుడనిపించాడు నాకు.
నాలుగు నెలల క్రితం కృష్ణమోహన్ గారు, అనిల్ బత్తుల గారు ఫోన్ చేసి మీరు ‘ఛాయ’ సంస్థలో జయకాంతన్ గారి గురించి మాట్లాడాలి అన్నప్పుడు మళ్ళీ రీ-రీడింగ్  చెయ్యగలిగే అవకాశం వచ్చిందని ఆనందపడ్డాను. వారి కధల్ని చదువుకోవటమంటే మనల్ని మనం చదువుకోవటమే. ఆయనొక సార్వజనీన రచయిత. ఈ పుస్తకంలో 16 కధలున్నాయి. అన్నీ మోడరన్ ఉపనిషత్తు కధల్లా వుంటాయి.
ఇలా జయకాంతన్ కధల గురించి వారితో పరిచయం గురించి కొన్ని పరిచయ వాక్యాలు మాట్లాడి మధురాంతకం నరేంద్ర వారి ప్రసంగాన్ని రెండు భాగాలుగా కొనసాగించారు. మొదటి భాగంలో వారు కధలని విశ్లేషిస్తూ వెళ్లారు. ఆ తర్వాతి భాగం జయకాంతన్ కధలకు సంబంధించి కొన్ని అబ్జర్వేషన్స్ లేదా పరిశీలనలతో సాగింది. ఒక స్రష్ట చూసిన ప్రపంచం తెలియాలంటే జయకాంతన్ పుస్తకాలు చదవాలంటారు నరేంద్ర.
వారు విశ్లేషించిన కధలలో మొదటిది ‘గురుపీఠం’. ఒక సత్రంలో ఒక బిక్షగాడు. పశుప్రాయుడు. నిత్యం ఎవరు ఏది పెడతారా అని ఆశగా చూసేవాడు. పాచిపోయిన ఆహారం తప్పితే మరొకటి తెలియని వాడు. నిత్యం పుసులు గట్టిన కళ్ళతో వుండే వాడికి ఒకరోజొక ఆకారం నమస్కారం చేస్తుంది. మీరేనా గురువంటుంది. అలా ఆ ఆకారం నేను మీ శిష్యుడిని అని ఈ బిచ్చగాడు ఏది చెప్పినా దాన్నో అధ్బుతంగా భావిస్తూ ఉంటాడు. బిచ్కగాడు ఆకాశంకేసి చూస్తూ వుంటే ఆకాశం శూన్యమని ఎంతబాగా సెలవిచ్చారంటాడు. పాచిపోయిన ఆహారం తినేవాడికి పులిహోర, దద్దోజనం పట్టుకొస్తాడు. క్రమంగా గురువు ఖ్యాతిని పెంచుతాడు. ఎవరు ఎవరికి శిష్యుడు అన్న అనుమానం ఈ బిచ్చగాడికి వస్తుంది. గురుస్థానంలో కూర్చొన్న బిచ్చగాడికి ఒకరోజున శిష్యుడు కనిపించటం మానేస్తాడు. గురు స్థానంలో తనని కూర్చోపెట్టిన ఆ శిష్యుడి పేరేమిటో తెలియదు. వాడి కోసం వెతుకుతూ ఉంటాడు.
ఇలా గురుపీఠం కోసం మనం ఎలా సిద్ధంగా చెబుతాడు జయకాంతన్.
అగ్నిప్రవేశం : సీత పేరు తీసుకురాకుండా ఆధునిక స్త్రీ రోజూ చేసే అగ్నిప్రవేశం గురించి చెబుతాడు జయకాంతన్. ఒక విధంగా చెప్పాలంటే జయకాంతన్ వన్నీ నవలికల్లాంటి కధలు. ఒక స్త్రీ బస్సు కోసం ఎదురుచూస్తోంది. భోరున వర్షం. సడన్ గా ఒక కారొచ్చి ఆగుతుంది. ఒక అపరిచితుడు ఆమెను కారులో తీసుకువెళతాడు. ఆ కారంటే ఆమెకు ఎంతో ఆకర్షణ కలుగుతుంది. అక్కడేం జరుగుతుందో జయకాంతన్ స్పష్టంగా చెప్పడు. కానీ జరగకూడనిదేదో జరిగిందని మనకు అర్ధమవుతుంది. ఆ వ్యక్తే ఆమెను ఇంటికి దూరంగా దింపేసి వెళ్లిపోతాడు. ఇంటికి చేరుకోగానే తల్లి మీద పడి ఏడుస్తుంది. తల్లి ఏమీ మాట్లాడకుండా బాత్రూంకు తీసుకెళ్ళి నాలుగు బకెట్ల నీరు కూతురిపై కుమ్మరిస్తుంది. నీకేం జరగలేదంటుంది.
జయకాంతన్ గొప్పదనం ఎక్కడుంటుందంటే ఒక కధలో చెప్పకుండా దాచిన విషయాలుంటాయి, తెలిసే చెప్పకుండా దాచిన విషయాలుంటాయి, సార్వజనీన విషయాలుంటాయి అన్న భావన మనకు స్ఫురింపచేస్తాడు. ఈ కధలో నయాసంపన్న వర్గం పై మనకున్న మోజును పరిచయం చేస్తాడు.
ఎవరి ఆంతర్యం వారిదే : ఈ కధలో ఒక ప్రొఫెసర్, ఆయన భార్య పల్లెటూరిలో తాతా, నాయనమ్మల దగ్గర పెరిగే వారబ్బాయి మనకు తారసపడతారు. పెద్దయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వస్తాడు ఆ కొడుకు. తండ్రి ఎవరో ఒక స్త్రీతో తిరగడం చూస్తాడు. కొంత నిఘా పెట్టి రెడ్ హాండెడ్ గా పట్టుకుంటాడు. నువ్వు చేసేది తప్పని తండ్రికి హితబోధ చేస్తాడు. విషయాన్ని తల్లికి చెబుతాడు. అప్పుడా తల్లి మీ నాన్న జీవితం మీ నాన్నది, నా జీవితం నాది, ఎవరి ఆంతర్యం వాళ్ళది, నువ్విక్కడినుంచి వెళ్లిపో అంటుంది. సంప్రదాయం, విలువలు గురించి చెప్పబోయిన ఆ కుర్రవాడు ఒక ఉత్తరం రాసి వెళ్లిపోతాడు.
భార్యా, భర్త ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఆయన సిగ్గుగా నవ్వుతాడు. ఆ తర్వాత జరిగిన విషయాలు వారి ఆంతరంగిక విషయాలు అంటాడు జయకాంతన్. ఇలా ఒక చిన్న ముగింపు వాక్యంతో మనల్ని ఆలోచనల్లో పడేస్తాడు జయకాంతన్.
ఆత్మదర్శనం : 70 – 80 ఏళ్ల సాంప్రదాయ బ్రాహ్మణ తండ్రి ఒకరోజు ఇంట్లోంచి మాయమయిపోతాడు. సరే తండ్రి కోసం కొడుకు వెతకటం మొదలు పెడతాడు. ఈలోగా తండ్రొక ఉత్తరం రాస్తాడు నువ్వు చెప్పే మంత్రాలకు అర్ధం నీకు తెలుసా అని మా గురువు గారు బజారులో నన్ను నిలదీశాడు అని. అవమానం ఫీలయి జంధ్యం తీసేసి ఆ ముసలాయన వెళ్లిపోతాడు. ఇది మన చేత జయకాంతన్ చేయించే ‘ఆత్మ దర్శనం’
పొరపాట్లు నేరాలు కావు : నాగరాజు అనే ధనవంతుడి దగ్గర కేథరిన్ అనే స్టెనో పనిచేస్తూ వుంటుంది. నాగరాజు ఇంట్లోనే కన్నయ్య అనే మిత్రుడు ఉంటూ ఉంటాడు. కేథరిన్ చనువును అపార్ధం చేసుకుంటాడు నాగరాజు. ఆ ఆమ్మాయి ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని క్షమించమంటాడు. మీలో మా నాన్నను చూసుకున్నాను అంటుందా అమ్మాయి. ఈలోగా కన్నయ్య ఒక ఐదువందల రూపాయలు కొట్టేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తిరిగొచ్చేసి ఆ డబ్బు కూడా ఇచ్చేసి నేనెందుకు ఈ పని చేశానో తెలీదు, క్షమించు అంటాడు. స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్ అయిన ఆ ధనవంతుడు ‘క్షమింపబడిన వాళ్లే క్షమిస్తారు’ అని అన్నాడని కధను ముగిస్తాడు జయకాంతన్. ఇలా ముగింపు వాక్యంతో కధను నిలబెడతాడు జయకాంతన్.
మూతబడిన ఇల్లు : తను ఏం చూసినా కధగా మలచగలిగే శక్తి జయకాంతన్ ది. ఒక ఆల్కెమీ ఏదో ఆయనకు తెలుసు. ఒక పాత ఖైదీ శిక్ష అనుభవించిన అనంతరం ఒక ఇల్లు కొనుక్కుంటాడు కానీ ఎవరూ అతన్ని ఆదరించరు. ఒక నాలుగేళ్ల పిల్ల మాత్రం అతనితో కబుర్లు చెబుతూ ఉంటుంది. ఆ పిల్లకి అతను చాక్లెట్లు అవి కొనిపెడుతూ ఉంటాడు. చివరికి అతను ఈ నిరాదరణ భరించలేక అక్కడ్నించి వెళ్లిపోతాడు. ఇప్పుడు కూడా ఆ పిల్ల ఆ ఇంట్లోకి తొంగి చూస్తూ వుంటుంది అని జయకాంతన్ కధని ముగిస్తాడు.
మౌనం ఒక భాష : ఇదో చదివితీరవలసిన కధ. అరవై ఏళ్ల వయసులో గర్భం దాల్చుతుందో స్త్రీ. పిల్లలకి పిల్లలు వచ్చే ఈ వయసులో ఈ ఖర్మేమిటి అని బాధపడుతూ వుంటుంది. అప్పుడు కొడుకు తల్లిని ఇంట్లో ఉన్న పనసచెట్టు దగ్గరకు తీసుకు వెళతాడు. పనస చెట్టు మొదళ్ళ దగ్గర కూడా కాయలు కాస్తుంది అని ఓదారుస్తాడు. నువ్వు సిగ్గుపడాల్సిన విషయం కాదమ్మా అంటాడు.
కొత్త చెప్పులు కరుస్తాయి : అతనికి కొత్త భార్య వచ్చింది. కానీ ఆ భార్య అనుకూలంగా లేదు. పెళ్ళయి ఆర్నెల్లు కాలేదు పెడముఖంగా ఉంటుంది. అతను వెళ్ళిపోతే హాయిగా ఫీలవుతూ ఉంటుంది. అతనది అవమానంగా భావిస్తాడు. పాత స్నేహితురాలు గుర్తుకు వస్తుంది. పెళ్ళికి ముందు ఆ స్నేహితురాలుతో కాలం కలిసి ఉంటాడు పెళ్లి మీద ప్రేమ పుట్టిస్తుందావిడ. మళ్ళీ ఆవిడని చూద్దామని వెళతాడు. తన గోడు చెప్పుకుంటాడు. నీ భార్యకు సంసారానికి అనుభవం లేదు నాకనుభవం వుంది అంటుంది. కొత్త చెప్పులు కరుస్తాయని పాత చెప్పులే వేసుకుంటామా అంటుంది. ఆవిడ వంక చూసి అతను భోరుమని ఏడుస్తాడు. ఎందుకు ఏడ్చాడో ఆలోచించమంటాడు జయకాంతన్. మానసిక సంఘర్షణలను ఒక్క మాటలో రాస్తాడు జయకాంతన్ అంటాడు నరేంద్ర.
ఇలా కధలను విశ్లేషించి జయకాంతన్ కధలకు సంబంధించి కొన్ని అబ్జర్వేషన్స్ ఆ రోజు సభలో సభికుల ముందుంచారు. కొన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.
జయకాంతన్ తనదయిన శైలిలో traditional పధ్ధతిలో కధలు చెబుతాడు. వారి కధలలో విశ్వాసాలుండవు. చిన్న విషయాన్ని కూడా పెంచుతూ రాయటం ఆయనకలవాటు. ఆయనో ప్రొఫెషనల్ రైటర్. కధని నవలగా, నవల నుంచి మరో నవలను సునాయాసంగా మలిచేవాడు.
ఎక్కడ దృశ్యమానం చేయాలో తెలిసినవాడు. కధలో కధ చెప్పే వ్యక్తి tone మాత్రమే విన్పిస్తాడు. అయితే 60, 70 దశకాలలో రాసినవి కాబట్టి నిడివి ఎక్కువే ఉంటుంది. అలంకారాలేవీ లేకుండా లిరికల్ గా కధలు రాస్తాడు జయకాంతన్. కధలోని ముగింపుతో ఒక effect సాధించడం ఒక్క జయకాంతన్ కే సాధ్యం.
హృదయాన్ని, మేధస్సును సమన్వయపరుస్తూ రాయటంలో జయకాంతన్ సిద్ధహస్తుడు. ఆయన కధలన్నింటిలో మనిషే కేంద్రకం. అణగారిన జీవితాలు, జీవితాల్లో వుండే చీకటి కోణాలపై టార్చి లైట్ లా కధను ఫోకస్ చేయటం ఆయన ప్రత్యేకత. ఈ రోజుకీ చెన్నై రైల్వే స్టేషన్ లోనూ, బస్ స్టాండుల్లోనూ ఆయన పాత్రలు సజీవ సాక్ష్యాలుగా మనకు సాక్షాత్కరిస్తాయి.
కధలను స్టోరీస్ ఆఫ్ ఐడియాస్, స్టోరీస్ ఆఫ్ ఆర్ట్ పద్ధతిలో చెబుతారు. జయకాంతన్ ది రెండవ పద్ధతి. ఒక ఆదర్శాన్ని తీసుకుని దానికి పాత్రలు తయారుచేసి కధలు రాయటం ఆయనకి అలవాటు.
అయితే ఆయన కధలలో కొంచెం కృత్రిమత్వం ఉందేమో అని ఇప్పుడు తోస్తోంది. స్టోరీస్ ఆఫ్ ఐడియాస్ పద్ధతిలో రాసేవారిలో ఆ సమస్య ఉంటుంది. కొన్నిచోట్ల పునరుక్తులు కూడా ఉంటాయి.
ఐతే జయకాంతన్ వ్యక్తిత్వ ముద్ర ఆయన కధల్లోని ముగింపులో ఉంటుంది. ఆ కధల్లో ఒక నిశబ్ధం ఉంటుంది. అది కధల వైశాల్యాన్ని మరింత విస్తృత పరుస్తుంది. రెండోసారి ఈ కధలను చదివినప్పుడు జయకాంతన్ మరింత స్పష్టాస్పష్టంగా అర్ధమయ్యాడు. ఆయన కధలు పెద్దవి అవడం వలన అనువాదాలలో వుండే క్లుప్తత ఒకోసారి ఆత్మను మింగేసింది. ఓహెన్రీ కూడా అలాంటి దురదృషవంతుడే.
విస్తృతంగా రాసినప్పుడు తనను తానే imitate చేసుకునే దుస్థితి ఎప్పుడూ ఆయనకు ఎదురవ్వలేదు. ఒక structural unity ఎప్పుడూ ఆయన రచనలో కనిపిస్తుంది. ఐతే అన్వయములేని పెద్ద పెద్ద వాక్యాలు జయకాంతన్ రాస్తారన్న అభిప్రాయం ఒకటుంది. అందువలన అనువాదానికి అంత తొందరగా లొంగడాయన.
*

chaaya event10

From Sita Rambabu Chennuri wall:
" మంత్ర ముగ్ధుల్ని చేసిన మంత్రనగరికి దారేది "
సమాజానికి సాహిత్యం చేసే మేలు ఒక్కోసారి రచయిత్రులు /రచయితులు చెప్పినపుడే మనకు అర్ధమవుతుంది .
కుప్పిలి పద్మ గారు అనగానే 
'మంచు పూలదారులు' ' పూల పరిమళాలు ' ' ఋతుసౌందర్యాలు' గుర్తుకొస్తాయి 
అయితే ' ఛాయ ' సంస్థ వారి పదవ కార్యక్రమంలో వారి ప్రసంగం సమాజం - సాహిత్యం ఈ రెండు ఇరుసుల చుట్టూ జీవితం ఎలా తిరుగుతుందో అద్భుతంగా చెప్పారావిడ !
స్త్రీలు గృహ హింస నుంచి పబ్లిక్ హింస వరకు హింసను యెదుర్కుంటూనే వున్నారు
స్త్రీలకు ఇదొక crisis time .
తన కధలలో అప్పర్ మిడిల్ క్లాస్ స్త్రీల జీవితాలలో emtional crisis ని చూపే ప్రయత్నం చేశానన్నారు
అయితే దళిత స్త్రీవాదుల ప్రశ్నలతో స్త్రీలందరూ ఒకటే కాదని అర్ధమయింది .
స్త్రీ వాద రచనలన్నీ ఒకటి కావు .
ప్రధానంగా వారు సమాజంలో వస్తున్న మార్పులు, అవి స్త్రీల
జీవితాల మీద చూపుతున్న ప్రభావం, సాహిత్యంలోకి ఆ మార్పుల్ని అనువదించిన విధానం..... ఇది వారు తన కధల్ని
వివరిస్తూ చెప్పటం కొత్తగా అనిపించింది
ఆవిడ లేవనెత్తిన ప్రశ్నలు అందరి
హృదయాల్ని తాకాయి .
సాహిత్యాన్ని ఇష్టంగా ఎంచుకున్న
కుప్పిలి పద్మ గారు ' మంత్రనగరికి దారేది ' తన రాబోయే నవలగా పేర్కొన్నారు
" నా గొంతు యెప్పుడు స్త్రీల వైపు,
ప్రజల వైపు ,ముఖ్యంగా యువతీ
యువకుల వైపు " అన్న వారి మాటలు గుర్తుండిపోయే మాటలు
హాజరయిన వారిలో రమణజీవి
ఖదీర్ ,కూర్మనాధ్ ,అజయప్రసాద్
అరిపిరాల సత్యప్రసాద్, కోడూరి విజయకుమార్ వంటి వారున్నారు
అనిల్ బత్తుల, కృష్ణమోహన్ లను
అభినందిద్దాం !









http://magazine.saarangabooks.com/2016/03/03/%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86%E0%B0%B2%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%AA%E0%B1%82%E0%B0%B2/



వెన్నెలదారుల్లో మంచుపూలవాన…

chaaya_10 (1)

-అరణ్య కృష్ణ
~

కుప్పిలి పద్మ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు.  ఆమె జగమెరిగిన స్త్రీవాద రచయిత్రి.  స్త్రీవాద దృక్పధంతో దాదాపు గత 20 సంవత్సరాలుగా ఎంతో క్రియాశీలకంగా రచనలు చేస్తున్నారు.  కథ, నవల, పత్రికా కాలం, ప్రేమలేఖలు, మ్యూజింగ్స్….ఇలా అన్ని రకాల రూపాల్లోనూ స్త్రీవాద భావజాలన్ని బలంగా వినిపిస్తున్నారు.  అయితే ఏదో స్త్రీ స్వేచ్చ గురించి ఉపరితల స్పర్శతో వాపోవటంగా కాక మారుతున్న వ్యవస్థ మూలాల్లోకి వెళ్ళి, అక్కడ వస్తున్న మార్పులు వ్యక్తుల మీద, తద్వారా మానవసంబంధాల మీద, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల మీద చూపుతున్న ప్రభావాన్ని ఒడిసి పట్టుకోవటం, ప్రతికూల ప్రభావాల్ని తన స్త్రీ పాత్రలు అవగతం చేసుకొని తెలివిగా, ధైర్యంగా ఎదుర్కొనే విధానాన్ని సూచించటం కూడా ఆమె రచనల్లో కనిపిస్తుంది.
పద్మ మొత్తం ఆరు కథా సంకలనాలు వెలువరించారు.  ఒక్కో కథా సంకలనం లో స్త్రీలకి సంబంధించిన ఒక్కో అంశం బాటం లైన్  గా ఉంటుంది.
ఒక స్త్రీవాదిగా కుప్పిలి పద్మ తన కథల్లో సమాజాన్ని అవగతం చేయటమే ముఖ్యంగా కనిపిస్తుంది.  అస్తిత్వవాద సాహిత్యకారులందరిలాగే ఆమె ఏ సిద్ధాంత రాజకీయ దృక్పథానికి కట్టుబడినట్లు కనబడరు.  స్త్రీల అస్తిత్వం చుట్టూ మానవసంబంధాల్లో జరిగే రాజకీయాల్ని గొప్పగా పట్టుకున్నప్పటికీ ఎక్కడా వర్తమాన రాజకీయాల ప్రస్తావన వుండదు.  బహుశ ఈ విధానం వలన ఇంకా ఎక్కువమందికి తను రీచ్ అయ్యే అవకాశం వుండొచ్చని ఆమె భావన అయ్యుండొచ్చు.
ఆమె ఎంచుకున్న వస్తువుకి సంబంధించిన పాత్రల నివాస వాతావరణం, ఆహారం, వస్త్రధారణ, భాష….అన్నింటిమీద ఆమెకున్న మంచి పట్టు కనబడుతుంది.  అది హోటల్ కావొచ్చు లేదా ఇల్లు కావొచ్చు లేదా ఆఫీస్ కావొచ్చు…తన పాత్రలు సంచరించే, తన పాత్రల్ని ప్రభావితం చేసే వాతావరణాన్ని చాలా పకడ్బందీగా మన కళ్ళముందుంచగలరామె.  ఆమె తనకు తెలియని వ్యక్తుల జీవితం గురించి, వాతావరణం గురించి ఎప్పుడూ రాయలేదు.  ఇది కథకి ఎంతో బలాన్నిచ్చే అంశం.  ఆమె ప్రధానంగా అర్బన్ రచయిత్రి.   మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి, అక్కడక్కడా ఉన్నత వర్గాల స్త్రీలే ఆమె కథానాయికలు.
ఇప్పటి సమాజంలో స్త్రీ ఒంటరి అయినా, వివాహిత అయినా సమస్యలు మాత్రం తప్పవు.  ఒంటరి స్త్రీలకు వారి కష్టాలు వారికుంటాయి.  చుట్టు పక్కల వారి మోరల్ పోలీసింగ్ పెద్ద సమస్య.  సింగిల్ వుమన్ అనగానే చుట్టుపక్కల వారికి అత్యంత సహజంగా చులకన భావం కలగటమో లేదా మోరల్ పోలీసింగ్ చేయటమో లేదా వ్యక్తిగత విషయాల్లోకి తలదూర్చి పెత్తనం చేయటమో జరుగుతుంది.  స్వంత కుటుంబ సభ్యులైతే ఆమె సంపాదన మీద, కదలికల మీద, స్వేచ్చా భావనల మీద పెత్తనం చేస్తారు.  శ్రేయోభిలాషుల రూపంలో అధికారం చెలాయిస్తుంటారు.
ఈ సింగిల్ వుమన్ యాతనలన్నీ మనకు “ముక్త” (1997) సంకలనంలో  ఎక్కువగా కనబడతాయి.  ఈ కథల్లోని కథానాయికలు ఇన్నాళ్ళూ స్త్రీల మనశ్శరీరాల మీద అమలవున్న భావజాలాల్ని నిక్కచ్చిగా ప్రశ్నిస్తారు.  “ముక్త” కథలో వర్కింగ్ వుమన్ అయినా     ముక్త తన కుటుంబసభ్యుల చక్రబంధం నుండి విముక్తమయ్యే తీరే కథాంశం. ఇంక “కేసు” అన్న కథలో ఒంటరి స్త్రీని ఒక “కేసు”గా చూసే అనైతిక నైబర్స్ యొక్క విశృంఖల నైతిక పెత్తనం కనబడుతుంది.  “గోడ” కథ స్త్రీలు తమ శరీరాలపై తామెందుకు అధికారం కలిగి ఉండాలనే విషయంపై పద్మగారి సునిశిత అవగాహన, విశ్లేషణ తెలియచెప్పే కథ.  పురుషుడి పట్ల ప్రేమని, మోహాన్ని అధిగమీంచేంత నియంత్రణ ఆడవారికి తమ శరీరాలపై ఎందుకుండాలనే విషయాన్ని ఎంతో ప్రభావవంతంగా చెప్పిన కథ.  ఒక లిబరేటెడ్ వుమన్ అయినంత మాత్రాన స్త్రీలెందుకు ఆచితూచి సంబంధాలేర్పరుచుకోవాలో తెలియచెప్పే కథ.  “నిర్ణయం” కథలో స్త్రీ తను తల్లి అవ్వాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం స్త్రీకే వుండాలని బలంగా చెప్పిన కథ.   సూటిపోటి మాటలతో ఎటువంటి సంకోచం లేకుండా దాడి చేసే మొగుళ్ళు,  కొంతవరకు ప్రోగ్రెసివ్ ఆలోచనలతో ముందుకొచ్చిన పురుషుల్లోనూ కీలకమైన సమయాల్లో స్త్రీకి మద్దతుగా నిలవలేని తనం, వారి దృష్ఠిలో స్త్రీ-పురుష సంబంధాల్లో అస్తిత్వ గౌరవం కంటే శారీరిక సంబంధమే ప్రధానంగా మిగిలిపోవటమే బాధ కలిగించే విషయంగా “నిర్ణయం, గోడ” వంటి కథలు చెబుతాయి.  “విడీఅరెల్” అన్న కథలో పెళ్ళైన యువతి గైనిక్ సమస్య ఎదురైనప్పుడు చెప్పుకోలేనితనం, ఎవరూ బాధని అర్ధం చేసుకోకుండా ఏకాకిని చేయటం కథాంశం.  అత్యంత సహజమైన శారీరిక సమస్యల్నెదుర్కోవటంలోని ఏకాకితనపు దుర్భరతనాన్ని విశదంగా చిత్రించిన కథ అది.
“మసిగుడ్డ” కథ స్త్రీ సంసార నిర్వహణలో ఎంత బాధ్యతాయుతంగా వున్నప్పటికీ , ఆమెకు దక్కే అప్రాధాన్య గుర్తింపుని ఎత్తిచూపుతుంది.  పిల్లలు పైకొస్తే “నా పిల్లలు” అని గర్వంగా చెప్పుకునే భర్త అదే పిల్లలు తప్పటడుగు లేస్టెనో లేదా వెనకబడిపోతేనో “ఏం చేస్తున్నావ్ అసలు? నీ పెంపకం అలా ఏడిసింది” అంటూ భార్యని నిష్ఠూరమాడతాడు.  వంటగది తుడుచుకోవటానికి ఉపయోగించే మసిగుడ్డ లాంటి అస్తిత్వాన్ని మోసే స్త్రీల ఆవేదన ఈ కథలో ప్రస్ఫుటంగా కనబడి మనల్ని విచలితుల్ని చేస్తుంది.  “ఆడిపాడిన ఇల్లు” ఒక వైవిధ్య కథాంశం.  తను ఆడిపాడి పెనవేసుకుపోయిన ఇంటికి సంబంధించిన నోస్టాల్జియా ఈ కథాంశం.  శిధిలమైన ఆ ఇల్లు తిరిగి కొనుక్కునే అవకాశం వచ్చినా వసుధ వద్దనుకుంటుంది.  శిధిలమైపోయిన ఇంటిని చదును చేసి ఓ మూడంతస్తుల ఇల్లు కట్టొచ్చు కానీ  ఆ నాటి ఇల్లవదుగా? “ ఆ నాటి బాల్యస్మృతుల ఆనవాలు లేని ఆ ఇల్లెందుకు? వద్దు” అనుకుంటుంది.  ఇలాంటి సున్నిత భావుక ప్రధానమైన అంశంతో కూడిన కథ కూడా ఈ సంకలనంలో వుండటం విశేషమే.
“సాలభంజిక” (2001) కథా సంకలనంలోని కథలు విశ్వవ్యాపితమై, మూడో ప్రపంచపు మానవసంబంధాలను అతలాకుతలం చేస్తున్న గ్లోబలైజేషన్ మీద రాసినవే.  గ్లోబలైజేషన్ని వ్యతిరేకించే మేధావులు సైద్ధాంతికంగా, ఆర్ధికాంశంగా దాన్ని వ్యతిరేకిస్తే రచయితలు అవి సామాన్యుల జీవితాల్ని అల్లకల్లోలం చేసే తీరుని ఒడిసిపట్టుకోవాల్సి వుంది.  పద్మ గారు ఈ బాధ్యతని గొప్పగా నిర్వహించారు.  “ఇన్ స్టెంట్ లైఫ్” కథలో చిన్న చేపని పెద్ద చేప చందంగా పెట్టుబడి బలంతో ఇడ్లీబండీ ని ఒక ఆధునిక ఈటింగ్ జాయింట్ మింగితే,  దాన్ని మరో స్టార్ హోటల్ మింగుతున్న క్రమానికి సమాంతరంగా కథానాయకి మునీరా జీవితంలో వచ్చిన మార్పులను అనుసంధానిస్తూ చెప్పిన తీరు విస్మయం కలిగిస్తుంది.  ప్రపంచీకరణ బాంకుల దగ్గర ఆగిపోకుండా పడగ్గదుల్లోకి చొచ్చుకొచ్చిన వైనాన్ని చెప్పిన కథ ఇది.  మనిషిని మనిషి అర్ధం చేసుకోవటానికి కార్పొరేట్ ప్రపంచానుకూల వ్యక్తిత్వ వికాస తరగతులు అనివార్యమైన విషాద సందర్భంలో రాసిన కథ ఇది.
“ప్రకంపనం” కథ కార్పొరేట్ రంగం అన్ని సామాజిక పార్శ్వాలకూ వ్యూహాత్మకంగా విస్తరించి వృత్తులను, బతుకు తెరువును పెట్టుబడితో కొల్లగొట్టి, బతుకుల్ని లొంగతీసుకునే క్రమాన్ని, ఈ లొంగుబాటు ఫలితంగా మనుషుల అంతరాత్మల్లోనూ, జీవనశైలుల్లోనూ వచ్చిన మార్పులవల్ల కంపేటిబిలిటీ చెడిపోయి అగాధాలు ఏర్పడిన తీరుని వెల్లడించిన కథ.  ఈ కథలో కార్పొరేట్ వ్యూహాల్ని కూడా సమర్ధవంతంగా చెప్పటం జరిగింది.  ఆర్ధిక పశుబలంతో వస్తువులను మార్కెట్లో తక్కువకు సప్లై చేసి, తద్వారా దేశీయ పెట్టుబడిదారులకు నష్టం కలిగించి, వారు తమ కర్మాగారాలను తమకే అమ్మేసే పరిస్తితి కలిపించి, టేకోవర్ చేసుకున్నాక, పోటీ ఉత్పత్తిదారుడు లేని పరిస్తితుల్లో ఉత్పత్తుల ధరల్ని పెంచేసే కార్పొరేట్ మాయాజాలాన్ని తేటతెల్లం చేసిన కథ ఇది.
“సాలభంజిక” కథ కార్పొరేట్ వ్యాపారం ప్రవేశపెట్టిన ఎస్కార్ట్ విధానం (విదేశీయులు భారత్ వచ్చినప్పుడు వారికి “తోడు”గా వుంటూ ఉల్లాసం కలిగించటం) ఊబిలోకి అమ్మాయిలు ఎలా జారిపడతారో, ఫలితంగా వారి మానసిక, శారీరిక ఆరోగ్యాలు సంక్షోభంలోకి ఎలా వెళ్ళిపోతాయో చెప్పే కథ.  అమ్మాయిల దయనీయ కుటుంబ పరిస్తితులు, భావోద్వేగాల బలహీనతల్ను స్వార్ధపరులు ఎలా ఉపయోగించుకుంటారో చెప్పే కథ ఇది.  ఈ కథ చదివాక మనసు కకావికలమై పోతుంది.   “కుబుసం” కథ కుటుంబ సంబంధాల్లో సరసరా సంచరిస్తూన్న కార్పొరేట్ పాము కక్కే విషం మీద కథ.  లాభార్జనే ధ్యేయంగా మసలే కార్పొరేట్ సంస్కృతికి అనుకూలంగా కుటుంబసంబంధాల్ని పునర్నిర్వచించే యంత్రాంగాన్ని బట్టబయలు చేసే కథ.  కుటుంబం దగ్గరుంటే, సహచరి పక్కనుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఉద్యోగులు పనిచేస్తారనే కార్పొరేట్ లాభాపేక్ష ఒక కుటుంబంలో పెట్టిన చిచ్చు ఈ కథాంశం.
“మంచుపూల వాన” (2008) సంకలనం లోని కథలు ప్రేమ, కుటుంబం, దాంపత్యం వంటి విషయాల్లో స్త్రీల భావోద్వేగాలకు సంబంధించిన కథలు.  ప్రధానంగా స్త్రీలు ఎదుర్కొనే ఎమోషనల్ వయోలెన్స్ గురించి రాసిన కథలు.  “వర్షపు జల్లులలో” కథ సాధారణంగా అబ్బాయిలకు అమ్మాయిల పట్ల ఉండే ఆకర్షణ, అమ్మాయిలకు అబ్బాయిల పట్ల కలిగే భావోద్వేగ స్పందనలతో డీల్ చేసిన కథ.  ఇందులో కథానాయకి మహి తల్లి దెబ్బతిన్న కూతురికి చెప్పే మాటలు చాలా బాగుంటాయి “కొన్ని సార్లు గాయపడటం అనివార్యం. అవసరం. ఒక కొత్త జీవితం అందులోంచే చిగురిస్తుంది.”  “మంచుపూల వాన” కథ పెళ్ళికి ముందున్న విలువలు మర్చిపోయి డబ్బు మనిషిగా తయారైన భర్త నుండి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ని ఎదుర్కొని అతని నుండి బైటపడ్డ మేఘ కథ.  రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇచ్చే ఇన్స్టెంట్ లాభం మనుషుల్ని ఎంతగా పతనం చేస్తుందో చెప్పే కథ ఇది.   “చలెగచలెగా యే ఇష్క్ కా జమానా” కథ కొంత హిలేరియస్ గా సాగుతుంది. ఈ సంకలనంలో ఇదో భిన్నమైన కథ.  తన గర్ల్ ఫ్రెండ్ ప్రేమని పొందటం కోసం ఆమె సామాజిక బాధ్యతగా ఫీలయ్యే విషయాల్లో పాలు పంచుకొనే కుర్రాడి అవస్థ భలేగా అనిపిస్తుంది.  “మంత్రనగరి సరిహద్దులలో” కథ  మంత్రముగ్దంగా సాగే కథ.  ఈ కథలో భావోద్వేగాల హింస కనబడదు కానీ ప్రేమ పట్ల స్త్రీ భావోద్వేగాల ఫోర్స్ కనబడుతుంది.  హృద్యమైన మోహప్రపంచం గురించి పద్మగారి భావుకత పరవళ్ళు తొక్కిన కథనం వున్నదిందులో.   ఒక ఆత్మగౌరవంగల స్త్రీ తనంత తానుగా మోహపడాలంటే  పురుషుడిలో ఎటువంటి ప్రవర్తన వుండాలో సూచించే కథ ఇది.
“వాన చెప్పిన రహస్యం” ఒక వైవిధ్యపూరితమైన కథనంతో సాగుతుంది.  తనని ప్రేమించలేదని క్లాస్ మేట్ మీద కత్తితో దాడి చేసిన యువకుడికి తనకు తెలియకుండానే, అనుకోకుండా ఆశ్రయమిచ్చిన అమ్మాయి కథ ఇది. ప్రేమ గురించి, ప్రేమైక అనుభవం గురించి తనకు ఆశ్రయమిచ్చిన ఆ అమ్మాయి ఆలోచనలతో ఇంటరాక్ట్ అయిన కుర్రాడి పరోక్ష కథ ఇది. “సెకండ్ హజ్బెండ్” కథలో భర్త చనిపోయాక రెండో వివాహం చేసుకున్న యువతి యాతన కథాంశం.  ఆ రెండో భర్త ఇంట్లో తన మొదటి భార్య పటం పెట్టుకోగలడు.  ఆమె పుట్టినరోజుని ఘనంగా చేయగలడు. అందుకు అందరూ అతన్ని ఎంతో మెచ్చుకుంటారు కూడా.  కానీ తన రెండో భార్య తన దివంగత భర్త ఫోటోని అతని వర్ధంతి రోజున బైటకి తీస్తే తట్టుకోలేక పోతాడు.  అతని తల్లి కూడా అభ్యంతర పెడుతుంది.  అతను తన కోపాన్ని లైంగిక హింసలో చల్లార్చుకుంటాడు.  ఇటువంటి పడగ్గది హింసని విచారించే ఏ న్యాయ వేదికలూ ఉండవు.  మంచాల మీది నేరాలు ఏ చట్ట పరిధిలోకీ రావు.  అయితే ఈ కథలన్నింటిలోనూ ముఖ్య పాత్ర సమాజాన్ని, అందులో భాగమైన తననీ అర్ధం చేసుకుంటుంది.  ఎలా నిలబడాలో తెలుసుకుంటుంది.
“ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్” కథ దర్శన, విహాస్ ల మధ్య వుండీ లేనట్లుగా దోబూచులాడే ప్రేమ భావన కథాంశం. వారి మధ్య ప్రేమ అసత్యం కాదు.  కానీ అది సజీవమూ కాదు.  బతకాలంటే ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మరొకరికి లొంగాలి, అబద్ధాలు చెప్పాలి.  ఇంకెక్కడి అమాయకత్వం, స్వచ్చత?  “నా స్నేహితురాలి పేరు సుధీర” కూడా క్విక్ మనీ, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ల క్యాట్ రేస్ లో తనని, తన మనసుని, ఆ మనసులోని సున్నితత్వాన్ని మర్చిపోయి, చివరికి జీవితంలో చతికిల బడ్డ స్నేహితుణ్ని అక్కున చేర్చుకొని “ఇది మన జనరేషన్ క్రైసిస్.  ఇది గ్లోబల్ ఎకానమీ సృష్ఠించే వికృతం” అని ఓదార్చిన సుధీర కథ.   పెళ్ళి చేసుకుంటే తనకొక ఇల్లు ఏర్పడటం కాకుండా తను పెళ్ళి చేసుకున్న వాడింటికి తను వెళ్ళటమనే పరిస్తితి మీద తెలివిగా తిరుగబాటు చేసిన గ్రీష్మ కథ “ఫ్రంట్ సీట్”.
స్త్రీ శరీరాన్ని సరొగసీ రూపంలో సరికొత్త పద్ధతిలో వెలగట్టి వాడుకునే ప్రపంచీకరణ విశృఖలత్వం “మదర్ హుడ్ @ రియాలిటీ చెక్” కథలో కనబడుతుంది.  ఈ కథ ఒక ప్రత్యేక కథనంతో పరుగులు పెడుతుంది.  అద్దె గర్భం చుట్టూ వ్యాపారం చేసే వికృతస్వభావాలు బట్టబయలు చేస్తారు రచయిత్రి.  “హ్యుమన్ టచ్” ఎలిమెంటుతో ఎక్కువ టి.ఆర్.పి.ల కోసం లేని మెలోడ్రామా కోసం ప్రయత్నం చేసే చానెళ్ళ వాళ్ళు, ఎక్కడికక్కడ దండుకునే మధ్యవర్తులు, వచ్చిన సొమ్ముని దోచుకునే కుటుంబసభ్యులు అంతా స్త్రీ గర్భం మీద ఆధారపడే వాళ్ళే. చాలా కదిలించే కథ ఇది.  “గాల్లో తేలినట్లుందే” కథ యువత ఎలా పెడదారి పడతారో, వారు అలా పెడదారి పట్టడాన్ని ప్రోత్సహించే వ్యాపార సంస్కృతి ఏమిటో తెలియచెప్పే కథ.  “మౌన” కథ చాలా భిన్నమైన కథ.   ఇద్దరు స్త్రీల మధ్య పుట్టిన అనురాగం శారీరిక అనుబంధంగా ఎదిగిన తరువాత ఏర్పడిన కల్లోలాన్ని వివరించే కథ.  ఎన్.వేణుగోపాల్ ఈ సంకలనానికి ముందు మాటలో రాసినట్లు “ఈ కొత్త తరం అమాయకత్వం కోల్పోవటాన్ని నిజానికి చాలా రంగాల్లో, కోణాల్లో, స్థాయిల్లో అర్ధం చెసుకోవలసి ఉంది. అది సంఘ్ పరివార్, ఖాఫ్ పంచాయితీలు చూస్తున్న ఏకైక, సంకుచిత, పురుషాధిపత్య అర్ధంలో మాత్రమే  జరగడం లేదు. సంక్లిష్ట, అసాధారణ రూపాల్లో జరుగుతున్నది”.  ఆ అసాధారణ, సంక్లిష్ట రూపాలన్నింటినీ తన కథల్లో పద్మ గారు ప్రస్ఫుటంగానే చూపించారు.
ఆమె కథలన్నీ వర్ష బిందువులు, చిరుజల్లులు, పున్నాగపూలు, మంచు ముత్యాలు, తుషారాలతో నిండి వుంటాయి.  ఒక్కోసారి కథలో ప్రవేశించటానికి ఈ ప్రకృతి మోహం కొన్ని ఆటంకాల్ని కలుగచేస్తుంది కూడా.  ఇంక పాత్రల పేర్లైతే గ్రీష్మ, ధాన్య, దక్షిణ, సుధీర, దర్శన వంటి అందమైన పేర్లతో అలరారుతుంటాయి.  జీవితం ఎంత బీభత్సంగా ఉన్నా సరే,  మొత్తానికి పాత్రలన్నీ జీవితంతో ఘర్షణ పడుతుంటాయి.  మర్రిచెట్లు కూలుతున్న నేపధ్యంలో అవి లొంగిపోకుండా తుఫాను గాలికెదురొడ్డి నిలబడ్డ చిన్న మొక్కల్లా తమని బతికించుకుంటాయి.  అందుకే ఈ కథలు చదివాక జీవితం మీద ధైర్యం, ఆత్మ విశ్వాసం కలిగించే అవకాశం వుంది.  పద్మగారి కథల్లో అమ్మ పాత్రకి చాలా విలువుంది. చాలా కథల్లఉజ జీవితాన్ని అర్ధం చేసుకోవటంలో అమ్మ చాలా దోహదం చేస్తుంది.  అమ్మ అంటే ఒక గొప్ప సపోర్ట్ అనే భావన బలంగా కలుగుతుంది.
సమాజం మీద, జీవితం మీద అపారమైన అవగాహన, నమ్మకం మాత్రమే కాక ప్రేమని కూడా కలిగివున్న కుప్పిలి పద్మ ఇప్పటికే తనదైన సంతకం చేసారు.  ఆమె నుండి మరిన్ని మాస్టర్ పీసెస్ ఆశిస్తూ…
peepal-leaves-2013

chaaya event9

Chaaya 9th event invitation:
Design: Bangaru Brahmam


Chaya Foundations Conducts Rajareddy's Oka Baatasari Bhairagi Padhaalu :
-----------------------------------------------
ఛాయ నోట్ మరీ క్లుప్తంగా ఉండటం వల్ల, కొంత కన్ఫ్యూజన్ కు తావిస్తోందేమోననిపించింది. అందుకే ఈ వివరణతో కూడిన ఆహ్వానం.
నా మూడు పుస్తకాలు: మధుపం, పలక-పెన్సిల్, రియాలిటీ చెక్... వీటితోపాటు ఇంకా పుస్తకాలుగా రాని ఆజన్మం కాలమ్, ఆ తర్వాతి రాతలు... అలాగే, నా కథలు... (చుక్కలు పెట్టకుండా రాయడం కష్టంగానే ఉందే!) ఒక విధంగా ఐదు పుస్తకాలన్నమాట! ఓ, ఐదు! రాయడం అంతకు పదేళ్లముందే మొదలుపెట్టినా, 2008 నుంచి 2015 వరకు ఈ ఎనిమిదేళ్లలో పబ్లిష్ చేసినవివన్నీ! వీటన్నింటి గురించి మిత్రుడు, విమర్శకుడు కాకుమాని శ్రీనివాసరావు మాట్లాడుతారు. ఆ రాతల్ని బట్టి, తన ప్రసంగానికి కాకుమాని ఎంచుకున్న శీర్షిక ఈ 'ఒక బాటసారి బైరాగి పదాలు'. అంతే తప్ప, ఒకరిద్దరు సన్నిహితులు పొరబడినట్టుగా అది నా కొత్త పుస్తకం పేరు కాదు. వచ్చే ఆదివారం ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 5:30కు దోమలగూడలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్లో జరిగే ఈ కార్యక్రమానికి పెద్దలు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, స్నేహితులు ఎవరైనా వీలు చేసుకుని వస్తే సంతోషిస్తాను.
by Pooduri Rajireddy


From Sita Rambabu Chennuri wall:
----------------------------------------
"బైరాగి పదాల బాటసారి "
పూడూరి రాజిరెడ్డి అభివ్యక్తి లాలస వున్నవాడు అన్నారు విమర్శకులు
కాకుమాను శ్రీనివాసరావు
నిన్న ' చాయ ' సంస్థ నిర్వహించిన
కార్యక్రమంలో పూడురి రాజిరెడ్డి రచనలపై ఆయన ప్రసంగించారు
ఆయన మాటల్లో
రాజిరెడ్డి మానుషానందం గురించి రాస్తాడు
చూపుల యుద్ధం గురించి రాస్తాడు
కాల్పనికతను నిరసిస్తూ రాస్తాడు
ఒక ప్రక్రియలో ఇమడడానికి ఇష్టపడని వ్యక్తి రాజిరెడ్డి
రాజిరెడ్డి ఒక సింబాలిస్ట్ అని ముగించారు
చాలామంది రచయితలు హాజరయ్యారు
అనిల్ బత్తుల కృష్ణమోహన్ లకు అభినందనలు
------------------------------------------------------
పూడురి రాజిరెడ్డి 'రియాలిటీ చెక్ '
పుస్తకాన్ని' పాలపిట్ట ' లో రివ్యూ చేసే అవకాశం కలిగింది నాకు
కాకుమాను శ్రీనివాసరావు గారు
సంస్కృతం పట్ల ప్రేమ వున్న విమర్శకులు అని నిన్న వారు రాజిరెడ్డి రచనల గురించి మాట్లాడుతూ వివరించారు
సంస్కృతాన్ని ఇంగ్లిష్ లో చదవాల్సివస్తోందని బాధ పడ్డారు
ఎవరి మీదో కోపంతో గొప్ప సారస్వతాన్ని దూరం చేసుకున్నాం కాదా..


http://magazine.saarangabooks.com/2016/02/03/%E0%B0%92%E0%B0%95-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9F%E0%B0%B2%E0%B1%82/
ఒక బాటసారి: కొన్ని మాటలూ
– కృష్ణ మోహన్ బాబు
~

(ఛాయ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న సాయంత్రం 5:30కు హైదరాబాద్, దోమలగూడలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్లో రాజిరెడ్డి రచనల మీద కాకుమాని శ్రీనివాసరావు ‘ఒక బాటసారి బైరాగి పదాలు’ పేరిట ప్రసంగించనున్న సందర్భంగా…)

mohanbabu“అక్కడ చెట్లు, మనుషులు వేర్వేరుగా లేరు. మట్టి, మనిషి వేర్వేరుగా లేరు.  ఒక సంస్కృతిగా, జీవన విధానంగా వాళ్ళు కొబ్బరిచెట్లతో మమేకమయ్యారు.  బతుకులో భాగంగా, బతుక్కి ఆలంబనగా కొబ్బరి చెట్లు కనిపించాయి”. 
కోనసీమలో మొదటిసారిగా ఓ పెళ్ళి కోసం అడుగు పెట్టినపుడు, మనుషుల్లా పరుచుకున్న చెట్లు, చెట్లై నిలబడ్డ మనుషుల్ని చూసి, జర్నలిస్ట్, రచయిత, పూడూరి రాజిరెడ్డికి కలిగిన భావన ఇది.  మామూలు, అతి మామూలు విషయాల్ని మెత్తని పదాలతో, గడుసు వాక్యాలతో రంగు రంగుల చిత్రాలుగా మలచగలిగిన నేర్పు రాజిరెడ్డిది. అలాంటి అందమయిన భావ చిత్రాల పొందికే ‘పలక – పెన్సిల్. ఇది రాజిరెడ్డి రెండో పుస్తకం.
బాల్యం నుంచి కౌమారం మీదుగా యవ్వనంలోకి అడుగు పెడుతున్న కుర్రాడి గొంతులో, ఆలోచనల్లో వచ్చే మార్పులే బలపం – పెన్సిల్ – పెన్నుగా మారి ఈ పుస్తకంలో మన ముందుకొస్తాయి.  రచయిత జ్ఞాపకాలు, అనుభవాలు చదివితే తమ జీవితంలో కూడా యించుమించు అలాంటి అనుభవాలే ఉన్న స్పృహ పాఠకులకు కలుగుతుంది.  అందుకే రచయిత వాక్యాలు పాఠకుల ఆలోచనల్ని, జ్ఞాపకాల్ని మోసుకుంటూ వెళ్తాయి.
మొదటి అనుభవాలు రేకులు విప్పినా, ‘అంమ’ అంటూ ముద్దు ముద్దుగా తొలి పలుకు గుర్తు చేసుకున్నా, ఊరి ముచ్చట్లు పెట్టి సందడి చేసినా, సిన్మాల గురించి పిల్ల ఆలోచనల్ని నెమరేసినా, మనం కూడా అమాయకంగా జారి పోయిన క్షణాల్ని తడిమి తడిమి చూసుకుంటాం. ఆనందం లాంటి విచారంలో ములిగిపోతాం.  అంగీ విప్పి హీరోయిజానికి ప్రయత్నించటం, ఆడపిల్లతో కలంస్నేహం గురించి ఆరాటపడటం, వెలుగూ వెన్నెలా అంటూ ఆమెనే కలవరించటం, కౌమారపు పీల గొంతులో మొహమాట్లాడటం, పెదాలు విప్పని నవ్వులో జర జరా జారిపోయే జ్ఞాపకాలే.
‘జీవిత రైలు కొత్త ప్లాట్ ఫామ్ మీదకు రాబోతున్నది!’, ‘డైరీలో ఏం రాయాలి?’,  ‘భోగి మంటల్లో ఏం వేద్దాం?’,  ‘మనుషుల మ్యూజియం’ –  అంటూ గంభీరమైన గొంతుతో పలకరించినపుడు, అప్పుడప్పుడే స్థిరపడుతున్న ఆలోచనలతో కొంచెం తలెత్తుకుని చిరు పొగరుతో మాట్లాడిన కాలం మన ముందుంటుంది.  ‘ప్రేమ’, ‘మనసు కేరాఫ్’,  ‘క్షణికం’,  ‘మాయ’ – చదువుతున్నప్పుడు  అప్పుడే గీసుకున్న లేత గడ్డం తాలూకు సన్నని మంటలా, చేతివేళ్ళ కంటుకున్న సిరా మరకల్లా మన జ్ఞాపకాలు మనల్ని  ఒరుసుకుంటూ వెళ్ళటం చూడొచ్చు.  ఏ రచనైనా ఏదో రూపంలో మనల్ని తనలోకి లాక్కోవడం— అదో ఎక్స్పీరియన్స్.
కొన్ని కొన్ని సందర్భాలలో రచయిత తిరుగులేని స్టేట్మెంట్స్ మన ముందుంచుతాడు.  వాటి నుంచి మనం తప్పించుకోలేము.  ఎలా డీల్ చేయాలో తెలియక తికమక పడతాం.  ‘అల్లరి వీళ్ళ కవల పిల్ల’, అంటూ పిల్లల కోసం రాసిన రచనలో రచయిత ఏమంటున్నాడో చూడండి:
“యుధ్ధాలకు కారణం వాళ్ళు కాదు.  కరువుకు కారణం వాళ్ళు కాదు.  అవినీతికి, ఆర్ధిక మాంధ్యానికి వాళ్ళకు సంబంధం లేదు.  కులం, మతం, పేదరికం అనే శబ్దాలు విన్నప్పుడు వాళ్లెప్పుడూ చప్పట్లు కొట్టలేదు.  గ్లోబల్ వార్మింగ్ కు వాళ్ళే కారణం అని ఎక్కడా ఋజువు కాలేదు.  ఆకలి చావులు, శరణార్థి శిబిరాలు, బాంబు దాడులు… ఇవేవీ వాళ్ళు ఉపయోగించే పదబంధాలు కావు.  అయినా వీటన్నిటినీ వాళ్ళు ఎదుర్కోవాలి.  ఇన్ని సమస్యలు వాళ్ళ ముందుంచి, వాళ్ళకు మేమేం తక్కువ చేశామంటాం.  వాళ్ళు స్వేచ్ఛగా విహరించాలంటాం.  వాళ్ళు సదా సంతోషంగా ఉండాలంటాం.  ఎలా?  పిల్లలే గనక ఈ ప్రశ్న అడిగితే పెద్దల దగ్గర సమాధానం ఏమైనా ఉంటుందా?.”
ఇది చదివాక అనేక విషాద చిత్రాలు మన ముందు మెదుల్తాయి.  ఏమీ చేయలేక పోతున్నామనే నిస్సహాత ఆవరిస్తుంది.  తెలియని గిల్ట్ ఏదో మనల్ని బోనులో నిలబెడ్తుంది.  ఇలా తను చెప్పదల్చుకున్న విషయం పట్ల, మన ఆలోచనల్ని లాక్కెళ్ళగలగడం రచయిత సాధించిన విజయం.
రాజిరెడ్డి రచనలన్నీట్లో సాధారణంగా ఉండే ఒక మార్మిక గొంతు ఈ పుస్తకంలోనూ స్పష్టంగా కన్పిస్తుంది.  చాలా రచనలు ఓ బలమైన తాత్విక అంశంతో ముగియడం వల్ల ఆ రచన తాలూకు ఫీలింగ్స్ చాలా సేపటి వరకు మనల్ని వదలకుండా వెంటాడతాయి.  మచ్చుకు కొన్ని చూడండి:
“జీవితాన్ని పొడిగించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం… వీలైనన్ని ఎక్కువ జ్ఞాపకాలు పోగేసుకోవడమే.
“ఏ మార్మిక చిక్కుముడులు విప్పడానికి జీవితం యిలాంటి చిక్కు అలవాట్లను కల్పిస్తుందో!
“ఇల్లు మారినప్పుడు ఎలాగైతే పాత సామానులను వదిలేయక మోసుకెళ్తూ ఉంటామో, అలాగే భావాలను మోసుకెళ్తూ ఉంటాము.
“రోజూ సూర్యాస్తమయ సమయంలో ఆకాశం తగలబడి పోతూ ఉంటుంది.  బహుశా,అందువల్లేనేమో రాత్రి మరింత నిర్మలంగా కనబడుతుంది.
“నువ్వున్నావన్న ఒకే ఒక్క కారణంగా ఈ ప్రపంచాన్ని క్షమించేశాను.
“బతుకు ప్రవాహం స్థూలంగా అందరిదీ ఒకటే. సూక్ష్మంగా దేనికదే ప్రత్యేకం.”

ఇలాంటివి అనేకం, అనేకానేకం.

కొన్ని కొన్ని చోట్ల రచయిత ఏ అరమరికలు లేకుండా తన సర్వ గుణాలను మన ముందుంచుతాడు. ‘నేనేమిటి?’ అంటూ మొదలు పెట్టి ఒక్కొక్క పొర విప్పుతుంటే ఆ పదాల్లో మన ప్రతిబింబం కూడా కనబడి ఉలిక్కి పడతాం. పుస్తకం చదవటం పూర్తయ్యేసరికి మనం మండుటెండలో వేడి వేడి నీళ్ల స్నానం చేసి, ఏ.సి.లోకి వచ్చి సేద తీరుతున్న చిత్రమైన అనుభూతి పొందుతాం.
మిమ్మల్ని ఎప్పుడైనా చిన్న చిన్న చికాకులు చుట్టుముట్టినప్పుడు, ఏమిటో ఈ జీవితం అని నిర్లిప్తత ఆవరించినప్పుడు ఈ పుస్తకం చదవండి.  అప్పుడు, ఇప్పుడుగా ఎగిరి పోయిన ఆనందపు క్షణాలు పక్షులై మీ గుండె గోడల మీద వాల్తాయి.  మిమ్మల్ని మీరు సంబాళించుకునేలా చేస్తాయి. గ్యారంటీ.

raji











chaaya event 8





నేను వదులుకున్న పాఠాలు*
my talk on photgography ~
part-1: https://www.youtube.com/watch?v=DYKvbUI6Zxs&feature=youtu.be
part -2: https://www.youtube.com/watch?v=GvBzCBpbhzw&feature=youtu.be''
ఇది ఛాయా 8 వ నెలవారీ సమావేశం.
@ఆదివారం సాయంత్రం ఐదున్నరకు, హైదరాబాద్ స్టడీ సర్కిల్, దోమల్ గూడ
Thank you so much Dr,v.Jaya Prakas garu for uploading it.

From Vadrevu Ch Veerabhadrudu wall:
About Chaaya 8th meeting
కందుకూరి రమేష్ బాబు నాకు పదేళ్ళుగా తెలుసు. అతడు రాసిన 'కోళ్ళ మంగారం,మరికొందరు '(2006) తో పాటు మరొక రెండు పుస్తకాలు, 'బాలుడి శిల్పం ','గణితం అతడి వేళ్ళ మీద సంగీతం ', కూడా సమీక్ష చెయ్యమని వసంతలక్ష్మిగారు నాకు పంపిస్తూ అతడి గురించి నాలుగైదు మాటలు కూడా చెప్పారు. ఆ పుస్తకాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మన చుట్టూ ఉన్న జీవితంలో మనం చూడని,చూడటానికి ఆగని జీవిత సన్నివేశాల్ని, వ్యక్తుల్ని, జీవనసమరాన్ని అతడు ఆ పుస్తకాల్లో చూపించాడు.
కాని నిన్న అతడి ప్రసంగం 'నేను వదులుకున్న పాఠాలు ' విన్నప్పుడు రమేష్ బాబు ఈ పదేళ్ళలో చాలా దూరం ప్రయాణించేడనీ, చాలా పరిణతి సాధించేడనీ అర్థమయింది.
హైదరాబాదు స్టడీ సర్కిల్లో 'ఛాయ ' సంస్థ నెలవారీ సమావేశంలో తన ప్రసంగం వినడానికి నన్ను రమ్మని పిలిచినప్పుడు నేను కేవలం ఆసక్తితోనే వెళ్ళినా,నాతో పాటు అక్కడున్న కొద్ది మంది శ్రోతలూ కూడా దాదాపు గంట సేపు సాగిన ఆ ప్రసంగంలో పూర్తిగా నిమగ్నులైపోయారు. ఒక విధంగా అతడితో పాటు కలిసి ప్రయాణించేరు. గొప్ప ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటున్నప్పుడు జరిగేటట్టే, ఆ మాటలు వింటున్నంతసేపూ దాదాపుగా ప్రతి ఒక్కరూ అంతర్ముఖీనులైపోయారు.
రమేష్ బాబు తన ప్రసంగ విషయంగా తాను వదులుకున్న పాఠాల్ని ఎంచుకుని, అటువంటి కొన్ని పాఠాల గురించి చెప్పినప్పటికీ, ఆ ప్రసంగమంతా ప్రధానంగా ప్రసిద్ధ భారతీయ ఛాయాచిత్రకారుడు రఘురాయ్ గురించిన ప్రసంగం గానే సాగింది. తనకీ,రఘురాయ్ కీ మధ్య సాన్నిహిత్యం గురించీ, రఘురాయ్ నుంచి తానేమి నేర్చుకున్నదీ చాలా చిన్ని చిన్ని సంఘటనలతో, ఉదాహరణలతో అతడు వివరించిన తీరు ఎంతో హృద్యంగానూ, భావస్ఫోరకంగానూ ఉంది.
ఒక ఉదాహరణ:
రఘురాయ్ ని స్టేట్స్ మన్ పత్రిక ఎడిటర్ మొదటిసారి మదర్ థెరెసా దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు ఆమె అతణ్ణి డెస్టిట్యూట్ హోం లో ఉన్న ఆశ్రమవాసుల ఫొటోలు తియ్యమని అడిగిందట. అతడు అట్లానే ఫొటోలు తీసుకువెళ్తే మదర్ వాటిని మెచ్చుకోలేకపోయిందట. 'జీవితంలో ఒక ఆశ, ఒక ఆసరా దొరికిన చివరిక్షణాల్లోని మనుషుల వదనాల్ల్లా లేవిందులో, శవాలూ, అస్థిపంజరాలూ మాత్రమే కనిపిస్తున్నాయి'అన్నదట ఆమె. అప్పుడు మదర్ కళ్ళతో అతడు మళ్ళా ఆ వదనాల్నే ఫొటోలు తీసేడట. ఈ సారి ఆ కెమేరా దృశ్యాన్ని కాక దర్శనాన్ని చిత్రీకరించగలిగిందట.
రమేష్ బాబు ప్రసంగమంతా దాదాపుగా ఈ అంశం చుట్టూతానే తిరిగింది. కెమేరా కన్ను, మానవుడి కన్ను- ఈ రెండింటి మధ్యా తేడా, ఫొటో తీస్తున్నప్పుడు మనిషి ఒక కన్ను మూసుకుని, మరొక కన్నుని కెమేరా కన్నుతో జతకలిపి, లెన్స్ అనే మూడవనేత్రంతో చూడటం ఎట్లానో తనకి రాఘు రాయ్ నుంచే తెలిసిందని ఎన్నో ఉదాహరణలు చెప్పాడు.
ఫొటో తియ్యడమంటే ఒక దృశ్యాన్ని బంధించడం మాత్రమే కాదు, ఆ దృశ్యంతో ఒక జీవితకాల అనుబంధం పెనవైచుకోవడమని కూడా తాను గ్రహించానని చెప్పాడు.
తానొకప్పుడు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఫొటోలు తియ్యడానికి వెళ్ళినప్పుడు తన ఇంట్లో దొంగతనం జరిగిందనీ, తిరిగి వచ్చాక తన ఇంటి ఎదట ఉండే ఒక ముసలమ్మ తనని ఎక్కడికివెళ్ళావని అడిగిందనీ, తాను మేడారం వెళ్ళానంటే, నీకు నమ్మకముందా అని అడిగిందనీ, తనకి నమ్మకం లేదని చెప్తే తప్పు కదా, నమ్మకం లేని చోటికి పోయి ఫొటోలు తియ్యకూడదు కదా అని అన్నదనీ చెప్పాడు. ఒక ప్రార్థనాస్థలానికి తాను టూరిస్టుగా వెళ్ళినందుకే తాను అటువంటి పరిహారం చెల్లించవలసి వచ్చిందని కూడా చెప్పాడు.
ప్రసంగం అయిన తర్వాత, ఒక శ్రోత లేచి, నమ్మకం లేని చోటకి వెళ్ళకూడదనడం అర్థమవుతోంది కాని, అక్కడ పోటోలు తీసినందుకు మీ ఇంట్లో దొంగతనం జరిగిందనడం అర్థం కావడం లేదంది. దానికి రమేష్ ఇచ్చిన జవాబు మరింత గంభీరం గా ఉంది. అతనన్నాడు కదా: 'నేనూ, నా భార్యా ఇంట్లో లేనందువల్ల దొంగతనం జరిగింది. మేడారం జాతరప్పుడు ఇళ్ళల్లో దొంగతనాలు జరగడం కూడా మామూలే. కాని ఆ దొంగతనం వల్ల అంత నష్టమే కనక నాకు జరగకపోయిఉంటే ఇంత విలువైన పాఠం నేను నేర్చుకుని ఉండేవాణ్ణి కాను.'
నేను కూడా లేచి నిలబడ్డాను.
'కాని ప్రశ్నలు అడగడానికి కాదు, నా ప్రశంస తెలియచెయ్యడానికి మాత్రమే ' అని చెప్పాను.
ఇంకా ఈ మాటలు కూడా చెప్పాను:
'రమేష్, అభ్యసనంలో 'లెర్నింగ్ ', 'అన్ లెర్నింగ్ ' అనే రెండు పార్శ్వాలున్నాయని మొదటినుంచీ పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈశావాస్యోపనిషత్తులో ఒక ప్రసిద్ధ శ్లోకముంది:
అంధం తమ: ప్రవిశంతి యే అవిద్యా ముపాసతే
తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాగం రతా:
(అవిద్యని ఉపాసించే వాళ్ళు అజ్ఞానంలో పడతారు. కాని విద్యని ఉపాసించేవాళ్ళు అంతకన్నా కూడా అజ్ఞానంలో పడతారు)
'అభ్యసనంలో నేర్చుకోవడం ఒక భాగమైతే, వదులుకోవడం రెండవ భాగం. ఎవరి చదువు లెర్నింగ్ తో ఆగిపోతుందో,అన్ లెర్నింగ్ వైపు సాగదో వారి జీవితం పరిపూర్ణం కాదు.మనం పిల్లవాణ్ణి విద్యావంతుణ్ణి చెయ్యడమే కాదు, అతణ్ణి విద్యనుంచి రక్షించాలి కూడా అని రూసో అన్నదిందుకే.'
'కాని చిత్రమేమిటంటే, సాధారణంగా, పాఠశాలలు, కళాశాలలు, ఉపాధ్యాయులు, పుస్తకాలు, గూగుల్, స్కైప్, ట్విట్టర్ లు మనకి లెర్నింగ్ కి మాత్రమే సహకరిస్తాయి. అన్ లెర్నింగ్ కావాలంటే, మాష్టార్లు కాదు, Master కావాలి. ఒక జెన్ గురువు, సూఫీ సాధువు వంటి మాష్టర్ కావాలి. అతడు మటుకే మనని విద్యనుంచి రక్షిస్తాడు.మీకు అట్లాంటి మాష్టర్ రఘురాయ్ రూపంలో కనిపించాడు. అతడితో మీ అనుభవాలు వింటూంటే నాకు గొప్ప గురు-శిష్య సంభాషణలు వింటున్నట్టనిపించింది. చాలా సంతోషంగానూ, తృప్తిగానూ కూడా ఉంది '
అని కూడా చెప్పాను.





http://magazine.saarangabooks.com/2015/12/30/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%87-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%9F%E0%B1%80-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%80%E0%B0%AA/


సామాన్యుడే నా సిటీ, నా పీపుల్, నా స్టడీ: రమేష్

my one of image (1)


అవును. ఈ ప్రపంచాన్ని సన్నిహితంగా దర్శించడానికి ఒక కన్నుచాలు.
లేదా ఒక సామాన్యుడి జీవన సాఫల్యాన్ని గమనించినా ఈ ప్రపంచ రీతి అర్థమగును.
ఛాయ మిత్రులు జనవరి మూడో తేదీన ఏర్పాటు చేస్తున్న “నేను వదులుకున్న పాఠాలు” కార్యక్రమం సందర్భంగా కందుకూరి రమేష్ బాబుతో  మోహన్ బాబు, అనిల్ బత్తుల ముఖాముఖి
ఇంట్రో…
కందుకూరి రమేష్ బాబు  కేవలం ఒక రచయిత అనుకుంటే  అతని  ఇంకా  అనేక  సగాలు  ఫక్కున  నవ్వుతాయి. పోనీ, కేవలం  ఫోటోగ్రాఫర్  అనుకుంటే  అసలు అతన్ని  గురించి మనకేమీ తెలియదనే! తనకి  తానే  ఒక  అందమైన  వలయం రమేష్. ఈ  వలయంలో  రమేష్  అనేక  పాత్రలుగా కనిపిస్తాడు, గిర్రు  గిర్రున తిరుగుతూ- చాలా సార్లు అతనొక  అబ్బురం! భిన్న అభిరుచుల  సంబురం!   
పాఠకులకు తెలుసు, ‘దృశ్యాదృశ్యం’తో కందుకూరి రమేష్ బాబు సంభాషించే విధానం. అలాగే ‘సామాన్యశాస్తం’ పేరుతో రమేష్  రచించిన పుస్తకాలూ చాలామందికి తెలుసు. తొలి పుస్తకం ‘కోళ్ల మంగారం మరికొందరు’. మలి పుస్తకం ‘గణితం అతడి వేళ్ల మీది సంగీతం’. ఆ ఒరవడిలో  పన్నెండు పుస్తకాలు రచించి ప్రచురించాడు. ఇటీవలే మొన్నటి బుక్ ఫేర్ లో ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకం విడుదల చేశాడు. ‘శిఖరాలుగా ఎదగడం కాదు, మైదానాలుగా విస్తరించడం ఇందులోని ఇతివృత్తం’ అంటాడు. అయితే, తాను ఐదేళ్ల తర్వాత ఈ పుస్తకం తెచ్చాడుగానీ, ఇటీవలి కాలంలో సోషల్ మీడియంలో తాను ఫొటోగ్రాఫర్ గానూ సుపరిచితుడు. మరి ఆ రచయిత, ఫొటోగ్రాఫర్ తో ఈ ఆదివారం సాయంత్రం ‘ఛాయ’ తన ఎనిమిదవ నెలవారీ సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో తన ప్రసంగాంశం’ నేను వదులుకున్న పాఠాలు.’  ఈ సందర్భంగా ఈ ముఖాముఖి సారంగకు పాఠకులకు ప్రత్యేకం.
 రచన, ఫొటొగ్రఫి, జర్నలిజం – మిమ్మల్ని వీటి వైపు నడిపించిన నేపధ్యం ఏమిటి? కళల వైపు పడిన మొదటి అడుగుల గురించి చెప్పండి?
 
– స్కూల్లో నేవూరి రాజిరెడ్డి సార్ “బళ్లున తెల్లారింది…పిల్లల్లారా లేవండి” అన్న మాట కవిత్వం అని నాకప్పుడు తెలియదు. శ్రీనివాసా చారి సార్ తెలుగు పాఠాలు చెబుతూ, మధ్యలో “నిన్నటిదాకా శిలనైనా’ అన్న పాట పాడుతున్నప్పుడు కూడా నాకు తెలియదు, అది సాహిత్యం అని. ఎం.ఎ. చదివే రోజుల్లో కూడా నాకు మిల్టన్ గుడ్డివాడనే తెలుసుగానీ, ప్యారడైజ్ లాస్ట్ రాసినవాడే మళ్లీ ప్యారడైజ్ రిగేయిన్డ్ కూడా రాసిన చూపున్నవాడని తెలియదు. ఇదంతా సాహిత్యం అని అంతగా తెలియదు. శిష్టా లక్ష్మీనారాయణ అన్న మా ఫ్రొఫెసర్ ‘మెగలో మానియా’ గురించి చెప్పేవాడు. డాక్టర్ ఫాస్టస్ గురించి వివరించేవాడు. ఆయన చెబుతుంటే ఊగిపోయేవాడు. కానీ, తర్వాత తెలిసింది, ఇతడు చెబుతున్నది మార్లో సాహిత్యం గురించే తప్ప ఇతడు స్వయంగా సాహిత్యం కాదని. అట్లా కవులు, కళాకారులు, రచయితలు, ఫొటోగ్రాఫర్లు…నాకు జీవితంలో ఎంతోమంది ఎదురయ్యారు. లేదా నేనే ఎదురెళ్లాను వాళ్లకు. కానీ, వాళ్లు మామూలు మనుషులు. మరొకరి అసామాన్యతో వీళ్లు మాన్యులుగా కనిపించేవారే తప్ప వాళ్లు వాళ్లు కానేకాదు.  కొందరు నిజంగా తామే సాహిత్యం అని భ్రమించేవారు ఉన్నారు. తామే ఫొటోగ్రఫీ అని గర్వించేవాళ్లూ ఉన్నారు. వీళ్లను, వాళ్ల వివిధాలనూ చూస్తుంటే రచన, ఫొటోగ్రఫి వైపు నేను నిదానంగా వేసిన అడుగులు సాహిత్యం వైపు కాదు, నిజ జీవితం వైపనిపిస్తోంది. సాహిత్యం పేరుతో చెలామణి అయ్యే మనుషుల్లోని డొల్లతనం నుంచి తప్పించుకుని అమిత శ్రద్ధతో నేను సహజ  మానవులను కలిశానని! తమ పాట తాము పాడుకునే చిల్లర దేవుళ్లను పూజించడం నేర్చుకున్నానని! అందులో భాగంగానే నేను ఫిక్షన్ కాకుండా  నాన్  ఫిక్షన్ రచయితగా మిగిలి బతికి పోయాను. లేకపోతే గొప్ప రచయితనై ఇప్పటికే మరణించేవాడిని. కళల వైపు నడవకుండా జీవకళ దగ్గరే ఆగి, అదే సత్యం, శివం, సుందరం అని నమ్మి, మామూలు ఫొటోగ్రాఫర్ ని అయ్యాను గానీ  లేకపోతే మహా గొప్ప ఫొటోగ్రాఫర్ ని అయి, నా చుట్టుముట్టున్నవాళ్లలో ఒకడినై విర్రవీగేవాడిని. ధాంక్స్ టు మై నాన్న, అమ్మా. వాళ్లు నా తులసికోట. భూమండలం అంతా తిరిగి ఇంట్లోనే వెతుక్కున్న సామాన్యతే నా కళకు జీవనాధారం.
నిజం.
ఒక్క మాటలో నేను నడిచింది మనిషి దగ్గరకు. నేనే రచించి చేరింది, వాస్తవికత దగ్గరకు. నేను ప్రతిబింబించింది సహజ జీవన చందస్సును. జీవన వ్యాకరణం చెంతకు.  ఇంతకన్నా ఏమీ లేదు. అయితే నేను సూక్ష్మ దర్శినిని. ప్రపంచాన్ని దర్శించడానికి రెండు కళ్లు అక్కర్లేదని తెలుసుకున్న వ్యూ ఫైండర్ ని. ఇక, మొన్న తెచ్చిన “మీరు సామాన్యులు కావడం ఎలా?” అన్న పుస్తకం వాస్తవిత నుంచి సత్యం వైపు తీసుకొచ్చిన నా తొట్టతొలి పుస్తకం. దీంట్లో నేను జీవితాన్నే కల్పనగా గ్రహించి రచించి సామాన్యత తాలూకు తాత్వికతను విభూతిగా ధరించి జేబులో పెన్నూ, భుజానికి కన్నూతో హాయిగా బతుకుతున్న క్షణాన్ని.
my portriat (1)
మీ బాల్యం గురించి చెప్పండి?
రమేష్ వాళ్ళ నాన్న కిషన్ సార్
రమేష్ వాళ్ళ నాన్న కిషన్ సార్
ఇప్పటికీ బాల్యంలోనే ఉన్నాను. చిన్నప్పుడు  మమ్మల్ని అన్నం తినకపోతే భయపెట్టడానికి చాకలి తొంట మల్లయ్యను పిలిచేవారు. పెద్ద పెద్ద మీసాలతో కనిపించే ఆయన నా దృష్టిపథంలో ముద్రపడిన మొదటి ఫొటో. తొలి ఛాయ. తర్వాత మళ్లీ అలాంటి ఛాయలను నేను ఎన్నో తీశాను. ఆయన్ని తప్ప. చిత్రమేమిటంటే నేను పేర్లను, వ్యక్తులను చిత్రించను. మనుషులను చిత్రిస్తాను. ఒక రకంగా మానవులను చిత్రిస్తాను. ఒక భయపెట్టే మనిషి నాలో ముద్ర పడ్డాక భయాన్ని ఆ మనుషుల్లో చిత్రిస్తాను. ఆనందపరిచే ఈస్తటిక్స్ ఉంటే ఆ ఆనంద సౌరభాన్ని చిత్రీకరిస్తూ పో్తాను. అందాన్ని, ఆనందాన్ని అభిమానాన్ని, ప్రేమను, వయ్యారాన్ని అన్నింటినీ, నలుపును విస్మరించి తెలుపును చిత్రిస్తూ ఉంటాను. ఒక రకంగా  బ్రైటర్ సైడ్ ను చిత్రీస్తూ ఉంటాను. డెత్ ను కూడా చేస్తాను.  మనిషి శ్వాసించే అంతిమ శ్వాస మృత్యువు. దాన్ని కూడా అందంగా చిత్రిస్తాను. అసలుకు నాకు నెగటివ్ అంటే పాజిటివ్ కు భూమిక అన్న ఎరుక చిన్నప్పటినుంచే ఉంది. ఎందుకంటే మా నాన్న ఫొటోగ్రాఫర్. మా చెల్లెండ్ల పేర్లమీద స్వాతి, జ్యోతి ఫొటో స్టూడియోలు ఉండేవి. ఇల్లే మాకు  చిత్రాలయం. నేను బాలకార్మికుడిని అంటే ద్వేషిస్తాను. బాల కళాకారుడిని. మా ఇల్లే నాకు తొలి స్టూడియో. ప్రపంచం మలి స్టూడియో. నాకు డూమ్స్ సూర్యుడే. నాకు అంబరిల్లాలు ఆకాశం పరుస్తుంది.
ఫొటోలు కడగడం అన్నది నాకు వచ్చు. కెమెకల్ స్వయంగా తయారు చేసుకోవడం తెలిసిన వాడిని. మల్లెసారే మాకు డార్క్ రూమ్. 120, 35ఎం.ఎం. రీళ్లను డెవలప్ చేసి, ప్రింట్లు వేసి డెలివరీ చేసిన దశాబ్దాల అనుభవం మాది. దాంతో నెగటివ్ అంటే నాకు నలపు కాదు, తెలుపు. పాజిటివ్ అంటే తెలపు కాదు, నలుపు. అందువల్లే తెల్ల కాగితంపై నల్ల అక్షరం ఎలాగో లస్టర్, గ్లాసీ పేపర్ పై ఫొటో ప్రింట్ అలాగా. నా దుస్తుల్లోకీ ఆ నలుపు తెలుపులు వచ్చాయంటే అది సహజాతం  ఎప్పుడూ చెప్పలేదుగానీ, నేను కవి, చిత్రకారుడిని కాకముందే ఫొటోగ్రాఫర్ ని. తర్వాత పాత్రికేయ రచయితను. అటు పిమ్మట తిరిగి ఫొటోగ్రాఫర్ ని . తిరిగి తిరిగి జీవితం ఒక్క చోటుకే వస్తుందని సూర్యోదయం చంద్రోదయం తెలిపినట్లు నేను తొలి గురువుల దగ్గరే మళ్లీ వికసించాను. అమ్మా…నాన్న. తర్వాత మిగతా వాళ్లు. అయితే, నేను పని చేయలేదు. ఏదీ భారం కాలేదు నాకు. దీనర్థం  జీవితం పని చేసిందని!. గడిపిన జీవితం వల్ల దుస్తులు మారుతాయి తప్పా కొంటే వచ్చేవి కాదు. అందుకే నేనొక నలుపూ తెలుపూ. అదీ సంగతండీ.
సరే,  ఇక నేను నడవడం అన్నారు. నా దృష్టిలో మనల్ని నడిపించడం అంటూ ఏదీ వుండదు. మనం నడవడమూ వుండదు. నడకలో నడకైతాము. ఒక యూనిట్ విశ్వాన్ని నిర్ణయించదు. ఎవరైనా విశ్వంలో అంశం అవుతాం. నేను సోల్ ఆఫ్ ది యూనివర్స్ అన్న మాట వాడటానికి ఇష్టపడతాను. నాది కళ కూడా కాదు, క్షణం. కళ శాశ్వతమైంది. నేను క్షణభంగురమైన జీవితం గురించి ఆలోచిస్తాను. వాటికి శాశ్వతత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. శాశ్వతమైన వాటిని క్షణికం చేసే పనిలో కొందరుంటారు. ఆ పని నాకు రాదు. దైనందినాన్ని శాశ్వతం చేసుకునే సామాన్యుడే నా సిటీ. నా పీపుల్. నా స్టడీ.
తమ చిత్రాలను చూసి మురిసిపోతున్నసామాన్య మిత్రులు.
తమ చిత్రాలను చూసి మురిసిపోతున్నసామాన్య మిత్రులు.
అయితే, ఒక మాట. రచన, పాత్రికేయం రెండూ ఒకటే. పాత్రికేయం చరిత్రకు చిత్తు ప్రతి అనుకుంటే ఛాయా చిత్రణం అన్నది చరిత్రకు చిత్తరువు. పాత్రికేయం కన్నా రచన గొప్పదనుకునేవారుంటారు. కానీ, అన్ని రచనలూ ఇప్పడు పాత్రికేయంలో్కి ఒదిగిపోయి చాలా ఏళ్లయింది. అయితే మొత్తంగా రచన చరిత్రకు కోరస్. అందులో నువ్వూ నేనూ ఉన్నామనుకుంటాం కానీ, వుండం. అదృశ్యం అయిపోతాం.అందుకే దృశ్యాదృశ్యం రాస్తున్నాను సారంగలో.
మీరొకటి అనుకుంటారు. నేనొకటి అనుకుంటాను. ఉన్నది వేరొకటి. అయినా దృశ్యాదృశ్యంగా ఒకరికొకరం దగ్గరవుతూ దూరం అవుతాం. కావాలి కూడా.
 అయితే, ఫొటోగ్రఫి అన్నది కూడా రచనే. కాంతి రచనం.  అంతిమంగా ప్రతిబింబించడం అన్న సార్వజనీన లక్షణం నా ఇతివృత్తం. ఎలా జరిగిందో తెలియదు. కానీ, వీటన్నిటికీ మూలం మా నాన్న.  తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ టీచర్ గా కాకుండా బోధించడం కన్నా తెలియజేయడం, చూపడం, ప్రతిబింబించడం ప్రధానంగా పనిచేయడం వల్ల నాకు ఇంట్లోనే మాస్టర్ లభించాడు. ఆయన అద్భుతమైన ఫొటోగ్రాఫర్. ఎక్కడా కరెక్షన్ లేని మనిషి. ఎక్కడా పింక్, టచింగ్ చేయని మనిషి. యాజ్ ఇట్ ఈజ్ అన్నది తననుంచే నేను అందిపుచ్చుకున్నాను. అందువల్ల రచన, ఛాయా చిత్రలేఖనం నాకు మా ఇంట్లోనే మా నాన్న దగ్గర మా సొంత ఫొటో స్టూడియోల్లోంచే రూపొందిందని, నేను ఇంట గెలవడం అన్నది జరిగాకే బయట ఓడిపోవడం జరుగుతూ ఉందనీ అర్థం అవుతూ ఉన్నది నాలో నాకు.  అవును మరి. గ్రహించింది బయట ప్రాక్టీస్ చేయకపోవడం ఓటమి. నేను వదులుకున్న పాఠాలూ అన్నది కూడా ఇందుకే. బయట విజయాలు వదులుకుంటూ చిన్నప్పటినుంచీ సాధన చేసింది మళ్లీ ఒంటబట్టించుకుంటూ విస్తరిస్తున్నాను. ఆ మేరకు నేను నెగటివ్. పాజిటివ్ అర్థంలో. ఆంధ్రప్రదేశ్ లో పుట్టి తెలంగాణలో పెరగడం అన్నా అంతే కదా. ఇంటికి రావడం. మళ్లీ వికసించడం.
 సామాన్యశాస్త్రం పేరుతో మీరు చేస్తున్నరచనల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? వీటిని రాయడానికి ప్రేరేపించిన అంశాలేమిటి?
 
– ‘ఈ జగత్తులో బతికిన మనుషులందరిపై ఒక లైబ్రరీ తెరవాలి. అందులో మీ పరిచయ వ్యాసం తప్పక ఉండాలి’ అన్న మాట ఒకానొక రోజు తట్టింది నాకు. పని మొదలు పెట్టాను. పరిచయ పత్రాలు రాశాను. విస్తరించి నవలల వంటివీ రాశాను. పన్నెండు పుస్తకాలు తెచ్చాను. ఇందులో ఉద్దేశ్యం ఏమీ లేదు. విరుద్దేశమే. ఏ ఉద్దేశంతో మిగతా వారు రాశారో అందులో సామాన్యుడు మిస్ అయ్యాడు. దరిద్రుడిగా, అభాగ్యుడిగా, అధో జగత్ సహోదరుడిగా కనిపించాడేగానీ సృజనశీలుడిగా, భాగ్యవంతుడిగా జవజీవాలతో సెలబ్రేట్ కాలేదు. జీవితం సమరంగా భావించి వచ్చిన రచనలేగానీ జీవితం సంబురంగా ఉందన్న మాట చెప్పిన సామాన్య రచయితలు లేకుండా పోయారు. అప్పుడనిపించింది. ఇది నా పని అని!
పిచ్చి పట్టినట్టు చేశాను ఓ పదేళ్లు. తర్వాత తెలంగాణ. అందులో బాధ్యత ఎరిగిన యువకుడిగా పనిచేశాను. బావుంది. ఇప్పుడు వ్యక్తమవుతున్నాను. సామాన్యంగా.
అయితే, పెద్దలను కలవడం మానేశాను మెలమెల్లగా. నేను నిర్వ్యాపారంగా  కనిపించే జీవన వ్యాపారానికి దగ్గరగా జీవించడం మొదలెట్టాను. సామాన్యావతారం ఈ యుగం లక్షణం అని ముందే గ్రహించి నిశ్శబ్దంగా నా పని చేసుకుంటూ వెళ్లడం ప్రారంభించాను.  ఈ యుగం శ్రీశ్రీ ది కాదు. సామాన్యుడిదని ఏ విప్లవాన్ని గ్రహించినా తేలిగ్గా అర్థమౌతుంది.
నాకూ అర్థమైంది. విప్లవించే శక్తులైనా, క్యాపిటల్  శక్తులైనా పిడికెడు. వీళ్లు నాయకత్వపు లౌల్యానికి గురైతుండగా సునాయాసంగా విప్లవాన్ని చేసే శక్తి సామాన్యులకు ఉంది. వారిని చైతన్యం చేయబూనడం కరక్టు కాదు. వారి చైతన్యానికి స్పందించే లక్షణం ప్రకృతికి ఉంది. ఆ పని జరిగిపోతూనే ఉంది. ఇందుకు తాజా ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర సాధన. అందరూ సామాన్యులై సకల జనులూ సాదించలేదా?సాధించాక ఎలా జరిగిందో అని వారే మళ్లీ  ముక్కుమీద వేలు వేసుకోలేదా? అది ఒక పాట వంటి సామాన్యత సాధించిన విశేషం. లాలిపాట వంటి తల్లి మహత్యం.
 ఇంతకీ  సామాన్యుడంటే మీ దృష్టిలో ఎవరు? 
– ఎవరైతే తనను తాను ప్రదర్శనకు పెట్టుకోడో అతడు. మరెవరైతే అజ్ఞాతంగా కాదు, అదృశ్యంగా ఉంటాడో వాడు. వాడు. ఆ వాడు ఏకవచనం. తాను మట్టిలో పరిమళం. గాలిలో స్పర్శ. నీటిలో రుచి. ఆకాశంలో శబ్దం. నిప్పులో ఆకలి. పంచభూతం. తాను సర్యాంతర్యామి. అడవిలో ఉంటాడు. మైదానంలో ఉంటాడు. రాజు వాడే, పేద వాడే. వర్గం కాదు. వర్ణం కాదు, లింగం కాదు. మనిషి. సామాన్యుడు. అసాధన తన తత్వం. అర్థం కావాలంటే ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ చదవండి.
హక్కుల గురించి మాట్లాడేవాడు కాదు, బాధ్యత గురించి మాట్లాడేవాడు సామాన్యుడు.
 మీరు సామాన్యులు కావడం ఎలా? అన్న తాజా పుస్తకంలో మీరేం చెప్పారు?
–  నిజానికి చెప్పలేదు. చూపాను. గుర్తు చేశాను. మీ జీవితాలు మీరు గడపడం ఎప్పుడు ప్రారంభిస్తారో ఆలోచించుకోమని మననం చేశాను.  మీరు గాయకులు కావడమో లేదా శ్రోత కావడమో కాదు, మీరు స్వయంగా పాట అన్న విషయాన్ని గుర్తు చేశాను. ఆ గుర్తు చేయడం అన్నది సామాన్యంగా చేయలేదు. ఒక పాటను కంపోజ్ చేసినట్లు చేశాను. హృదయం ఉన్న వాళ్లకు నా పుస్తకం ఒక గీతాంజలి. బుద్దిగల వాళ్లకు ఫౌంటెన్ హెడ్. విప్లవశక్తులకు కమ్యూనిస్టు  మ్యానిఫెస్టో. దళిత బహుజనులకు అంబేద్కర్ పూలే. ఇవేవీ చదవని వాళ్లకు సామాన్యశాస్త్రం.
 సామాన్యులను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమాన్ని శ్వాసించిన నేపథ్యంలో మీరేదైనా నవల రాస్తే బాగుంటుందేమో కదా?
– నాకు వేరే ఉద్దేశ్యాలున్నాయి. వార్తలు, సంఘటనలు, విశేషాలు, విశ్లేషణలు, చరిత్రాక ఘట్టాలపై నాకు ఆసక్తి లేదు. అందులో నేనుంటాను. కానీ, నేను చరిత్రను రచించను. ఆ దరిదాపుల్లోకి వెళ్లను. ఎందుకంటే, నాకు పండు కన్నా రసం ఇష్టం. అది బాగుందని చెప్పడం కన్నా ఆరగించి ఆస్వాదించడం ఇష్టం. నేను సామాన్యుడిని.
ఒక సామాన్య రచయితగా,  ఏది చదివితే ఇక మరొకటి చదవనక్కర్లేదో అది చెప్పడానికి నేను యోచిస్తుంటాను. సూక్ష్మంలో మోక్షం లభించే అంశాల గురించి ఆలోచిస్తాను. నా రచన చదివితే మీరు దూరపు కొండల నునుపు కాలికింది కంకరలో కనపడేలా చేస్తాను. దైనందినంలో ఎంత వైశాల్యముందో, లౌకికంలో ఎంత అలౌకికం ఉందో తెలియజెబుతాను. అంతేగానీ, వర్తమానాన్ని చూపడానికో గతాన్ని గుర్తు చేయడానికో, భవిష్యత్తును తీర్చిదిద్దడానికో కాదు. కాలం గురించిన స్పహ లేకుండానే కాలం చేసే మనిషిలా నా రచన సర్వసామాన్యంగా ఉండాలని ఎవరి దిష్టీ తాకకూడదని భావిస్తాను. అందుకే నా పన్నెండు పుస్తకాలూ సామాన్యులకు తప్పా ప్రసిద్దులకు చేర్చలేదు. పద్దెనిమిదేళ్ల ప్రయాణంలో ఒక పుష్కర కాలం శ్రద్దతో కూడిన సామాన్యశాస్త్రం వ్యాసంగానంతరం ఒకడొచ్చాడు. నీ పుస్తకం నేను వేస్తాను అని వచ్చాడు. వాడు క్రాంతి. అతడికి తెలిసింది, ఇది ఇవ్వాళ్టి పుస్తకం అని. అవసరం అని. ఇచ్చాను. ఇక ముందు నేను ఎక్కువ రాయాల్సిన పనిలేదు. రాసిందంతా బయటకు వస్తే చాలు. నిజం.
అయితే, నవల. అవును, కల్పనాత్మక నవల. దానికన్నా జీవితం కల్పనగా కానవచ్చే మానవ ఇతిహాసం నాకిష్టం.  ‘మీరు సామాన్యులు కావడం ఎలా? ‘ చదివారా? మూడుసార్లు చదవాలని మిత్రులు చెప్పారు. మూడు సార్లయినా కంట తడిపెట్టించిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఆ పుస్తకం వందలాది మంది చేతుల్లోకి వెళ్లింది. రాత్రుల్లు వారు మేలుకుని జీవితంలోకి తొంగి చూస్తున్నారు. మెసేజ్ లుకాదు, మనుషులు వచ్చి కలుస్తున్నారు, సామాన్యంగా.
ఇలా రచనలైతే, నా ప్రయాణంలో బతికిన క్షణాలను నిక్షిప్తం చేయడం నా ఛాయా చిత్రణం. అదీ కల్పనే. నమ్మలేని గ్రామీణ జీవన జానపద ఔపోసనం నా ఛాయలు. సిటీలోనే తీస్తారా అని అడుగుతారు. తీస్తాను. ఇదంతా తెలంగాణ కాదా? నేనెక్కడికైనా పోయానా? ఇదంతా నవల కాదా? కొత్తగా లేదా? చూస్తుంటే ఎన్ని జ్ఞాపకాలు గిర్రున తిరగడం లేదు?
మీరు సంప్రదాయ ప్రశ్నలు మానేయాలి. సమాధానాలు పురాతనంగా ఉంటాయి. ఒక మనోఫలకంపై ముద్రించిన ఛాయలా. నా ఛాయలు అవే. అందుకే ఒప్పుకున్నాను, ఛాయ నిర్వహించే సమావేశం నా జీవనఛాయలపై అంతే!
ramesh2
అయినా చెబుతాను. మరో మాటా పంచుకుంటాను. నిజానికి ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకంలోని అంశం తెలంగాణ ఇరుసుగా జనించిందే. తెలంగాణ సమాజం అప్ వార్డ్ మొబిలిటీతో ఆక్రమిత దోపిడీకి గురై విలవిల్లాడి బయటపడ్డాకే ఈ బుక్కు వచ్చింది. ఒక రకంగా తెలంగాణ  సామాన్యతకు దగ్గరైనందువల్లే ఒక రాష్ట్రంగా ఏర్పడింది.  సకల జనుల కూడిక అంటే అదే. సాధారణాంశాలు, ప్రత్యేకాంశాలు ఒక ఈక్వలిబ్రియం లా ఒక్కచోటకు చేరడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అటు తర్వాత సాధారణత్వాన్ని, ప్రత్యేకాంశాలను ఈ స్థానిక జీవలాక్షాణికతతో వికసింపజేసుకోవాలి. ఆ పని పక్కకుపోతున్నదన్న భావంతోనే నేను ‘మీరు  సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకం రాశాను. పొలిటికల్ సెన్స్ ఉన్న వారికి ఈ సంగతి తెలుస్తుంది. తెలియని వారికి నా పుస్తకం విజయానికి ఐదు మెట్లు వంటి పుస్తకాలకు భిన్నమైందని చదువుతారు. ఎలా అయినా నా ప్రయోజనం నెరవేరుతుంది. ఒక నావల్ ఎలిమెంట్ తో రాసిన పుస్తకం అది. విన్నవాళ్లకు విన్నంత పాట అది!
 ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్నది ఒక విత్తనమే.  వృక్షాన్ని విత్తాను, పుటల్లో. పుష్పాల్లోని సౌరభాన్ని అద్దాను అత్తరుగా. మై సిటీ మై పీపుల్ కూడా అంతే. అది మీ ముఖ పత్రం. ఫేస్ బుక్. పుటలు పుటలుగా మీరు వదులుకున్న బతికిన క్షణాలను నేను పరుస్తూ పోతాను, ఛాయలుగా, చిత్రాలుగా. అందుకే అవన్నీ నా ఫొటోలు కాదు. నేనూ ఫొటోగ్రాఫర్ నీ కాదు. అవన్నీ మీవైన జీవితాల్ని మీరు తీయలేనప్పటి ఫొటోగ్రాఫర్లు. మీవైన రచనల్ని మీరు చదవనప్పటి రైటర్లు.
అన్నట్టు, రచనల నుంచి మీ దృష్టి ఫొటోగ్రఫీ వైపు మళ్లడానికి బలమైన కారణాలే ఏమిటి?
–  నేను వేరేవాళ్ల రచనలు అచ్చువేసే పనిలో ఉన్నాను. ఉద్యోగరీత్యా అమిత శ్రద్దతో ‘బతుకమ్మ’ పత్రికను తీర్చిదిద్దాను. దాదాపు ఐదేళ్లుగా వేరే వాళ్ల రచనలు చదివి, అచ్చువేసే పనిలో నిమగ్నమయ్యాను. నన్ను ఫొటోగ్రఫిలో వుంచుకున్నాను. అదొక కారణం. అలాగే ఇంకో కారణం…అక్షరాస్యులు చాలా వాటిని చదవలేక పోతున్నారు. నిరక్షరాస్యులు చాలామంది అంధులవుతున్నారు. వారిద్దరి కళ్లూ తెరిపించాలని. నాతో సహా వారందరికీ మరింత అందమైన ప్రపంచాన్ని చూపాలని. మరింత విస్తారమైన జీవితాన్ని డైజెస్ట్ చేయించాలని. సూక్ష్మ నాళికలో జనజీవనాన్ని దాచి రాబోయే తరాలకు కానుకగా అందించాలని. ఒక మనిషి రెండు చేతులతో ఈ భూగోళాన్ని ఎత్తడం చాలా సులభం, భుజానికి కెమెరా వేసుకుని! నేను ఎత్తాను. మీకు తెలియదు. ఒక లక్షమంది మనుషులు నాతో సహజీవనం చేస్తున్నారు, మా ఇంట్లో. నా మూడు హార్డ్ డిస్కుల్లో. రేపటి తరానికి నా కానుక ఇది కనుకే ఇంత గట్టిగా సామాన్యంగా మాట్లాడటం. సామాన్యమే మరి.
అన్నింటికీ మించి, మనవల్ల ఈ ప్రపంచానికి ఎంత మేలు జరుగుతుందో తెలిస్తే అంత మేలు చేయడానికి దేనికైనా వెనుకాడడు సామాన్యుడు. నేనూ సామాన్యుడినే. రచించి, చిత్రించి మిమ్మల్ని సామాన్యులను చేయడానికి నాకేదో వరం లభించినట్లుంది. అందుకే సామాన్యంగా ఉండవలసి వస్తోంది కూడా. అంటే మరేం లేదు. ఇతివృత్తం వదలకుండా అదే పనిలో నిరాటంకంగా ఉండటం.
 రఘురాయ్ తో కలిసి పనిచేయాలని మీకెందుకనిపించింది? 
– సామాన్యుల జీవితాలను అధ్యయనం చేసే సమయంలో నాకు  కొన్ని సమస్యలుండేవి. ఆయన వద్దకు వెళ్లి వాటిని తానెట్లా పరిష్కరించుకుంటారో అర్థం చేసుకున్నాను. ఈ దేశంలోని మనుషులను, స్థలాలను ఆయన దర్శించి చిత్రీకరించినంతగా మరెవరూ చేయలేదు. అంతేగాక సామాన్య మానవుడిని డిగ్నిటీతో చూపారాయన. అందువల్లే ఆయన్ని కలవాలనుకున్నాను, కలిశాను. ఒక రచన చేయాలనుకుని వెళ్లి తిరిగి ఫొటోగ్రాఫర్ ని కూడా అయ్యాను.
 రఘురాయ్ ని కలిశాక మీరొదులుకున్న పాఠాలేమిటి? అంతగా మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలేమిటి? 
– రఘురాయ్ గారిని కలిశాక నేను సామాన్యశాస్త్రం రచనలు చేయలేదు. ఐదేళ్లుగా నేను పుస్తకం ప్రచురించలేదు. మొన్ననే ఆయన బర్త్ డే మరునాడే అంటే డిసెంబర్ 19 న ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకం రాశాను. కారణం ఏమిటంటే, ఆయన నా దృక్పథాన్ని సాపు చేశాడు. నా వైకల్యాన్ని సవరించాడు. ఫొటోగ్రఫి అంటే ఒక కెమెరా పనితనం కాదని చూపించాడు. ఒక వండర్ ఫుల్ హ్యూమన్ బీయింగ్ కాకుండా మీరు ఉత్తమ రచయితా, ఫొటోగ్రాఫర్ కాలేమన్న సత్యాన్ని అవగతం చేశాడు. చిత్రమేమిటంటే నేను అదే.అద్భుతాన్ని. కానీ, వేరొకరి జీవితాలను రచించి చూపించడంలో సామాన్యతను కోల్పోయాను. ఆయన్ని కలిశాక అసలు సిసలు సామాన్యుడెవరో తెలిసింది. కార్యక్రమంలో లేనివాడు సామాన్యుడని అవగతం అయింది. నేను కార్యక్రమాలను రద్దు చేసుకున్నాను. జీవించడం, ప్రతిబింబించడం. ఇంతే చేశాను. అందుకోసం నన్ను నేను చేరుకోవడానికి వేయిట్ చేశాను. ఆయన పుస్తకం రచన ఆపి మరీ ఆ పని చేశాను. ఐదేళ్లవుతోంది. ఈ క్రమంలో నన్ను నేను వదులుకున్నాను. ఒక బ్రాండ్ కు లొంగిపోకుండా నిలబడాలీ అనుకున్నాను. నాకు నేను బానిసను కాదల్చుకోలేదు. అన్నిటికన్నా మిన్నఅది ఎంత బాగున్నప్పటికీ వేరే వాళ్ల జీవితాలు గడపడం వదులకున్నాను. దీన్ని విడమర్చిచెప్పవలసి ఉందిగానీ, అది ఆదివారం రోజున ‘నేను వదులుకున్న పాఠాలు’ అన్న అంశంలో కొంచెం విడమరచి చెబుతాను. నిజానికి ఈ అంశాల సారాంశమే మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకంలోనూ చర్చించాను.
రఘురాయ్ గారిపై రమేష్ అల్బంని ఆయన చూస్తూ ఉన్న దృశ్యం
రఘురాయ్ గారిపై రమేష్ అల్బంని ఆయన చూస్తూ ఉన్న దృశ్యం
 రఘురాయ్ తో మీరు పంచుకున్న కొన్ని మధురానుభూతుల్ని చెప్పగలరా? 
– లేదు. అవి చాలా విశిష్టమైనవి. వాటిని రాసి చూపిస్తాను. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఒక భరతమాత ముద్దుబిడ్డ తనను తాను ఎంతగా అంకితమొనర్చి ఈ దేశాన్ని, ఇక్కడి స్థలాలను, మనుషులను పక్కపక్కనే…శతాబ్దాలకు శతాబ్దాలు నివసిస్తున్న  లౌకిక జీవన జన గణనని అపూర్వ పుస్తకంగా రచించి పంచుకుంటాను. అంతదాకా ఆయన్ని నాలో పొదగనీయండి. ఒక అందమైన అనుభవంలో ఉన్నాను. ఐదేళ్లయినా ఆసక్తి పోలేదంటే తప్పకుండా వారి పుస్తకం మీకు అందించడం ఖాయం. అయితే ఒకటి చెబుతాను. ఫొటోగ్రఫి ఈజ్ నాట్ ఫర్ ఆల్ ఫొటోగ్రాఫర్స్ అన్నారాయన. ఇంకో అద్భుతమైన సామాన్యతను చెప్పారాయన. జీవితం నువ్వు ఊహించని ఫలాన్ని ఇస్తుంది. నీకు ఫలానా కావాలనే ఉంటే నువ్వు చాలా మిస్ అవుతావు బాబూ అన్నాడు. నేను రఘురాయ్ పుస్తకం రచించడం నుంచి మెల్లగా తప్పుకున్నాను. అపుడు మీరు సామాన్యులు కావడం ఎలా అన్నపుస్తకం సునాయాసంగా వచ్చి నన్ను సఫలం చేసింది.
మీరు క్యాండిడ్ ఫొటోగ్రఫిని చేస్తుంటారు కదా? ఏదైనా ప్రత్యేక కారణాలున్నాయా?
– నిమగ్నం కావడమే. మనుషులు తమ ప్రకృతిలో తాము లీనం కావడంలో ఉన్న సత్యసంధత మరెక్కడా లేదు. అందుకే నా చిత్రాలు మీ వైపు చూడవు. నావైపూ చూడవు. తమలో తాముంటాయి. గడుపుతాయి జీవితాల్ని. ప్రదర్శించవు. నిజానికి క్యాండిడ్ ఫొటోగ్రఫి చేసేవాడు కూడా వేరేకాదు. వాడు కూడా జీవని. గడిపే మనిషి. వాళ్లను ఫొటో తీస్తూ  వాళ్ల పనిలో తాను పాటైతాడు. వాళ్ల పాటలో తాను బాటైతాడు. అందుకే అతడు తీసేవి చిత్రాలు కావు, రాసేవి రచనలూ కావు, జీవితాలు. నావి జీవితాలు సుమా.
అందుకే మొదలు అన్నాను. నా చిత్రాలు ఫొటోగ్రాఫర్లు. నా రచనలు రైటర్లు అని!
అవి వాళ్లవే. వాటిని చదువుతుంటే ఆయా పాత్రలు, వాటిని చూస్తుంటే ఆయా జీవితాలు మీతో సంభాషిస్తాయి. అందుకే అంటున్నాను. నేను వదులకున్న పాఠం ఏమిటంటే భగవంతుడి సంగతేమో గానీ, ఈ యుగంలో రచయిత మరణించాడు. మిగిలింది సామాన్యుడు. అతడితోటిదే నా వర్షిప్. అతడే నా సరస్వతి.
ఇది సామాన్య యుగం మరి.
 చివగా మరి రెండు ప్రశ్నలు. ఆగస్టులో మీరు నిర్వహించిన  సింగిల్ ఎగ్జిబిట్ ఛాయా చిత్ర ప్రదర్శనకి స్పందన ఎలా వుంది? భవిష్యత్ ప్రణాళికలేమిటి?
– ఫొటోగ్రఫిని జర్నలిజంలోకి తెచ్చి దాన్ని దెబ్బతీస్తున్నాం. నేను ఆ పని మున్ముందు చేయదల్చుకోలేదు. ఒక ఫొటో్గ్రాఫ్ చాలు, ప్రదర్శనకు అని నేను సాహసోపేతంగా ప్రదర్శించి  అభినందనలు అందుకున్నాను. ఒక్క చిత్రంతో సంభాషించగలిగే వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగాను.
ఒక రచన మాదిరి కాదు ఫొటోగ్రఫి. అది ఒక లిప్త. క్షణ భంగురం. దాంట్లో సృష్టి స్తితి లయ అంతా ఉంటుంది. ఆ ఎరుక ఉన్నవాడికి విశ్వం ఆశీర్వదిస్తుంది. అది దేవాలయంలోని గర్భగుడిలోని దైవం అవుతుంది. ప్రదక్షణలు పూర్తయ్యాక రావలసింది మోకరిల్లడానికే. గర్భగుడిలోకే. నా సింగిల్ ఎగ్జిబిట్ కూడా అలాంటిదే. ఒక దర్శనం. అందుకే అంటాను, చూపు కాదు, దర్శనం వేరని! ఈ ప్రపంచాన్ని దర్శించడానికి ఒక కన్నుచాలని! కెమెరా కన్ను!
ఆ దర్శనం అన్నది దైవమే కానక్కర్లేదు,ఈ కాలానికి.
మనిషి చాలని! తనను తాను ప్రదర్శించుకోని సామాన్యుడే ఆ దైవం. ఇక, భవిష్యత్తు అంటారా? దానికి నాతో ఏం ప్రణాళిక ఉందో మీరే చూస్తారు. చూద్దాం.
కృతజ్ఞతలు.
*